మందమర్రి టోల్ ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా.. తప్పిన పెను ప్రమాదం.
జనం వాయిస్, మందమర్రి, జూన్ 7:
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సింగరేణి కేకే-2 మైన్ ఓపెన్కాస్ట్ టోల్ ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కొత్తగూడెం నుంచి బెల్లంపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఉదయం సుమారు 4 గంటల సమయంలో టోల్ ప్లాజా వద్దకు చేరుకోగానే అదుపు తప్పి రోడ్డు డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు ఉండటంతో అతను ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు. బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పినట్లు అధికారులు, స్థానికులు భావిస్తున్నారు.
ఈ ఘటనలో బస్సు డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. టోల్ ప్లాజా సిబ్బంది కూడా వెంటనే స్పందించి రోడ్డుపై బోల్తా పడిన బస్సును తొలగించే చర్యలు చేపట్టారు.
అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. బస్సు అతివేగంగా ప్రయాణించడం వల్ల జరిగిందా, లేక తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల జరిగిందా అనే కోణాల్లో అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.