జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజుల్లో రాయితీ కల్పించాలి.
- టీఎస్ జేయూ జిల్లా అధ్యక్షుడు గట్టు మహేష్.
- పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం.
- సానుకూలంగా స్పందించిన డీఈఓ.
- జనం వాయిస్, పెద్దపల్లి, జూన్ 01:
- సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న జర్నలిస్టుల పిల్లల చదువులకు ప్రభుత్వం, విద్యాశాఖ అండగా నిలవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్ జేయూ) పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గట్టు మహేష్ జిల్లా విద్యాశాఖ అధికారిని కోరారు. సోమవారం పెద్దపల్లి జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) జి. శారద ని కలసి, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల్లో రాయితీ కల్పించాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ… నిరంతరం వార్తల సేకరణలో ఉంటూ సమాజ చైతన్యానికి తోడ్పడే జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉందన్నారు. ముఖ్యంగా కోవిడ్ తదనంతర పరిస్థితుల్లో, పెరిగిన నిత్యావసరాల ధరలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు భారీగా పెరగడం వల్ల జర్నలిస్టులు తమ పిల్లలను చదివించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ ఫీజుల దోపిడీని అరికట్టడంతో పాటు, వర్కింగ్ జర్నలిస్టుల పిల్లల స్కూల్ ఫీజుల్లో కనీసం 50 శాతం రాయితీ ఇచ్చేలా ప్రైవేట్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయాలని వారు డీఈఓను కోరారు. ఈ వినతిపై డీఈఓ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ జేయూ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అవునూరి సంపత్ తో పాటు సభ్యులు సాయి వంశీ, సురేష్, సతీష్, రాజమల్లు తదితరులు పాల్గోన్నారు.