అద్దె డబ్బులు చెల్లించలేదని గిరిజన కళాశాల భవనానికి తాళం వేసిన యజమాని.
ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఎం పార్టీ నాయకులు.
జనం వాయిస్, మంథని, నవంబర్ 24:
పెద్దపల్లి జిల్లా మంథని లోని గిరిజన గురుకుల బాలికల కళాశాల భవనానికి 8 మాసాలుగా అద్దె డబ్బులు ఇవ్వటం లేదని యజమాని కళాశాల కార్యాలయానికి తాళం వేయడం జరిగింది.సమాచారం అందుకున్న సిపిఎం పార్టీ నాయకులు కళాశాలను సందర్శించి రెవెన్యూ సిబ్బందితో కళాశాల సిబ్బంది మరియు యజమానితో చర్చలు జరిపారు .ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ మంథనిలో విద్యావ్యవస్థ రాను రాను నిర్వీర్యం అవుతుందని అన్నారు.దళితులు గిరిజనులు బడుగు బలహీన వర్గాల హాస్టల్ విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. ఏడు సంవత్సరాలుగా గిరిజన కళాశాల అద్దె భవనంలో కొనసాగుతుందని ఇంకా ఎన్ని సంవత్సరాలు గిరిజన విద్యార్థులు అద్దె భవనాలలో ఉండాలని ప్రశ్నించారు.ఎనిమిది మాసాలుగా అద్దె డబ్బులు యజమానికి ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. విద్యార్థులు సంవత్సర పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో కళాశాల భవనానికి తాళాలు వేసి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని అన్నారు.విద్యార్థినులు రోడ్డుమీదికి వస్తే ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు.అద్దె డబ్బులు చెల్లింపు విషయంలో ఆర్ సి ఓ చేతివాటం ప్రదర్శిస్తున్నాడని అనుకున్న పర్సంటేజ్ ప్రకారం మామూలు ఇవ్వకుంటే అద్దె డబ్బులు చెల్లించడం లేదని ఆర్ సి ఓ పనితీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు.మంత్రి శ్రీధర్ బాబు స్పందించి ప్రభుత్వం నుండి రావలసిన అద్దె డబ్బులు విడుదల చేయాలని గిరిజన బాలికల కళాశాల భవనంతో పాటు ఇతర హాస్టళ్లకు పక్క భవనాలు మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు.ఆయన వెంట ఆయన వెంట సిపిఎం నాయకులు మంథని లింగయ్య,బాబు,రవి ఉన్నారు.