janamvoice.com
Newspaper Banner
Date of Publish : 02 January 2026, 2:41 pm Digital Edition : GATTU MAHESH

కేంద్రం సంచలన నిర్ణయం..-ఫాస్టాగ్ వాడేవారికి భారీ ఊరట.<br>

కేంద్రం సంచలన నిర్ణయం..-ఫాస్టాగ్ వాడేవారికి భారీ ఊరట.

జనం వాయిస్, న్యూఢిల్లీ – జనవరి 02:

కొత్త ఏడాది సందర్భంగా ఫాస్టాగ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కల్పించింది. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి లైట్ మోటార్ వాహనాలకు వర్తించే ఫాస్టాగ్ విషయంలో ఇకపై కేవైవి ప్రక్రియ అవసరం లేదని జాతీయ రహదారి ప్రాధికార సంస్థ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది.
ఫాస్టాగ్ యాక్టివేషన్ పూర్తయ్యాక కూడా పదే పదే డాక్యుమెంట్ల ధృవీకరణ, బ్యాంకుల ఫాలోఅప్ కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా వ్యక్తిగత వాహనదారులు చాలా కాలంగా ఈ ప్రక్రియపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో లైట్ మోటార్ వాహనాల విభాగానికి కేవైవి నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రాధికార సంస్థ నిర్ణయించింది. ఫాస్టాగ్ జారీ చేసే ముందు వాహనానికి సంబంధించిన అన్ని వివరాలు సమర్పించి ప్రీ యాక్టివేషన్ పూర్తి చేయడం మాత్రం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఒకసారి ఫాస్టాగ్ యాక్టివేట్ అయిన తర్వాత మళ్లీ ప్రత్యేకంగా కేవైవి ప్రక్రియ అవసరం ఉండదన్నారు. ఇప్పటికే కార్లకు జారీ చేసిన ఫాస్టాగ్‌లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని వెల్లడించారు. అయితే ఫాస్టాగ్ దుర్వినియోగం, వాహనానికి సరిపోని విధంగా వాడటం వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కేవైవి అవసరం ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది వాహనదారులకు గణనీయమైన ఊరట లభించిందని చెప్పవచ్చు.