శాసనసభ నిర్వహణపై తీవ్ర విమర్శలు.
– సమయపాలన పాటించడంలేదని హరీష్ రావు ఆరోపణలు.
– టీ బ్రేక్ పేరుతో గంటల విరామంపై ప్రశ్నలు.
– ప్రజా సమస్యల కంటే ఎన్నికల ప్రచారానికే ప్రాధాన్యతా?.
జనం వాయిస్, హైదరాబాద్, మార్చి 31:
తెలంగాణ శాసనసభ నిర్వహణపై బీఆర్ఎస్ నేత టి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. సభకు అవసరమైన గౌరవం, సమయపాలన పాటించడంలేదని ఆరోపిస్తూ ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. శాసనసభను రాజకీయ వేదికలా మార్చేశారని ఆయన విమర్శించారు. అసెంబ్లీలో సాధారణంగా టీ బ్రేక్ 10 నిమిషాలు, లంచ్ బ్రేక్ అరగంట మాత్రమే ఉండగా, ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి వస్తున్నారని చెప్పి ఏకంగా నాలుగు గంటల టీ బ్రేక్ ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు అనుకూలం కాదని అభిప్రాయపడ్డారు.
కేరళ ఎన్నికల ప్రచారం కోసం శాసనసభ సమావేశాలను ముందుగానే ముగించారని కూడా ఆయన ఆరోపించారు. 30వ తేదీనే హడావుడిగా సభ ముగించడం వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా సభను ముగించడం సరైన పద్ధతి కాదని అన్నారు. ప్రజల సమస్యలను చర్చించాల్సిన వేదికగా ఉన్న శాసనసభను రాజకీయ కార్యక్రమాలకు వినియోగించడం బాధాకరమని హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందా అనే సందేహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ప్రజా సమస్యల కంటే ఎన్నికల ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తోందని ఆయన విమర్శించారు. శాసనసభ గౌరవాన్ని కాపాడే విధంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హరీష్ రావు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.