janamvoice.com
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 3:57 pm Digital Edition : JANAM VOICE

ఏపీ శాసనసభలో శివరాత్రి సందడి.

ఏపీ శాసనసభలో శివరాత్రి సందడి.

ఒకే వేషధారణతో మహిళా ప్రజాప్రతినిధుల ఐక్యత.
సభలో ఆధ్యాత్మిక వాతావరణం.
డిప్యూటీ సీఎం అభినందనలు.

జనం వాయిస్, అమరావతి:

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల వేళ అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. సభలో రాజకీయ అంశాలపై వాడివేడి చర్చలు కొనసాగుతున్నప్పటికీ, రేపటి మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. కూటమి ప్రభుత్వానికి చెందిన మహిళా మంత్రులు, శాసనసభ్యులు భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఒకే తరహా వస్త్రధారణతో సభకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహా శివరాత్రి సందర్భంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి సహా పలువురు మహిళా ప్రజాప్రతినిధులు శివతత్వానికి ప్రతీకగా నిలిచే ప్రత్యేక చీరలను ధరించి అసెంబ్లీకి వచ్చారు. మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి, ఎస్ సవితతో పాటు ఇతర మహిళా ఎమ్మెల్యేలు సైతం ఒకే రంగు, ఒకే తరహా దుస్తులతో హాజరై ఐక్యతను ప్రదర్శించారు. శాసనసభ ప్రాంగణం వారి రాకతో కళకళలాడింది. అనంతరం మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళా ప్రజాప్రతినిధులు చూపిన ఉత్సాహాన్ని, ఐక్యతా స్ఫూర్తిని ఆయన అభినందించారు. పండుగ స్ఫూర్తిని శాసనసభ వేదికకు తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. సంస్కృతీ సంప్రదాయాలకు విలువ ఇవ్వడం ప్రజలకు మంచి సందేశమని తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా సంప్రదాయాలను గౌరవిస్తూ శాసనసభలో పండుగ వాతావరణాన్ని సృష్టించడం సర్వత్రా ప్రశంసలు పొందుతోంది. ముందస్తు శివరాత్రి సందడి అసెంబ్లీ సమావేశాలకు కొత్త శోభను తీసుకువచ్చింది. మహిళా శక్తి, సంఘటితత్వానికి ఈ దృశ్యం ప్రతీకగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.