పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు విశిష్ట సన్మానం.
విద్యా ప్రమాణాల పెంపులో రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచిన పెద్దపల్లి జిల్లాకు రాష్ట్ర స్థాయి గుర్తింపు.
ముఖ్యమంత్రి, గవర్నర్ చేతుల మీదుగా సన్మానం, ప్రశంసా పత్రం అందజేత.
జనం వాయిస్, పెద్దపల్లి, జూన్ 19:
విద్యా ప్రమాణాల పెంపులో పెద్దపల్లి జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపినందుకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా విద్యాశాఖ అధికారులకు విశిష్ట గౌరవం లభించింది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లోని ఎల్.బి. స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ను సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. విద్యా రంగంలో నాణ్యతాభివృద్ధి, విద్యార్థుల అభ్యాస ఫలితాల మెరుగుదల, పాఠశాలల సమర్థ నిర్వహణలో పెద్దపల్లి జిల్లాను రాష్ట్రంలో ముందంజలో నిలిపినందుకు ఈ గుర్తింపు లభించింది. వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది సమక్షంలో ఈ సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా విద్యా వ్యవస్థ అభివృద్ధికి కృషి చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యా రంగ భాగస్వాములు మరియు సిబ్బంది అందరికీ జిల్లా యంత్రాంగం అభినందనలు తెలియజేసింది. జిల్లా విద్యా రంగ అభివృద్ధికి అందరూ సమష్టిగా కృషి చేయడం వల్లే ఈ గౌరవం సాధ్యమైందని, భవిష్యత్తులో కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు.