janamvoice.com
Newspaper Banner
Date of Publish : 03 November 2025, 6:21 am Digital Edition : GATTU MAHESH

ఆడవాళ్లు చితక్కొట్టేశారు..వరల్డ్ కప్ మనదే..!

ఆడవాళ్లు చితక్కొట్టేశారు..వరల్డ్ కప్ మనదే..!

జనం వాయిస్ వెబ్:

భారత మహిళల క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు ఇది.ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను చివరకు టీమిండియా ముద్దాడింది.ఆదివారం ముంబైలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో, భారత మహిళా జట్టు సమష్టి ప్రదర్శనతో 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత ఇన్నింగ్స్‌లో యువ సంచలనం షెఫాలీ వర్మ (87 పరుగులు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పటిష్టమైన పునాది వేయగా, ఆమెకు స్మృతి మంధాన (45) చక్కటి సహకారం అందించింది.అనంతరం మధ్యలో కాస్త తడబడినా, కష్టకాలంలో వచ్చిన దీప్తి శర్మ (58 పరుగులు) అద్భుతమైన అర్ధ సెంచరీతో జట్టును ఆదుకుంది. ఆఖర్లో రిచా ఘోష్ (34) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 300 మార్కుకు చేరువైంది. సౌతాఫ్రికా బౌలర్లలో ఖాక మూడు వికెట్లతో రాణించినా, భారత బ్యాటర్ల ధాటిని ఆపలేకపోయారు.299 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా పటిష్టంగానే ప్రారంభించినా, భారత స్పిన్ దాటికి తట్టుకోలేకపోయింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ (101 పరుగులు) మాత్రమే భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి, అద్భుతమైన సెంచరీతో ఒంటరి పోరాటం చేసింది. అయితే, మరోవైపు బ్యాటర్లు నిలదొక్కుకోలేకపోయారు.అక్కడ హీరోగా నిలిచింది దీప్తి శర్మ. బ్యాటింగ్‌లో అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్న దీప్తి, బౌలింగ్‌లో ఏకంగా ఐదు వికెట్లు (5/39) తీసి సౌతాఫ్రికా బ్యాటింగ్ నడ్డి విరిచింది. కీలక సమయాల్లో దీప్తి వికెట్లు తీయడం మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేసింది. దీప్తికి తోడుగా యువ ఓపెనర్ షెఫాలీ వర్మ (2 వికెట్లు) రెండు కీలక వికెట్లు పడగొట్టి తన ఆల్‌రౌండర్ సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఇక, తెలుగు తేజం శ్రీ చరణి (1 వికెట్) కూడా తన వంతు పాత్ర పోషించింది.