గల్లీ క్రికెట్కే పనికిరాడన్న విమర్శలు.
– అయినా టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు.
జనం వాయిస్, స్పోర్ట్స్ న్యూస్:
టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన జట్టు తీవ్ర చర్చకు దారి తీసింది. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన పలువురు ఆటగాళ్లకు అవకాశం దక్కకపోగా, ఎవరూ ఊహించని కొన్ని పేర్లు జట్టులో చోటు దక్కించుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా రంజీ ట్రోఫీ స్థాయిలో కూడా సరైన అనుభవం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్న ఓ ఆటగాడిని ఎంపిక చేయడం వెనుక గంభీర్ మొండిపట్టు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ ప్రపంచకప్ జట్టు ఎంపికలో వన్డే, టెస్ట్ జట్లకు నాయకత్వం వహిస్తున్న శుభ్మన్ గిల్ను పక్కన పెట్టడం పెద్ద సంచలనంగా మారింది. అదే సమయంలో దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించిన జితేష్ శర్మకు చోటు దక్కకపోవడం అభిమానులను నిరాశపరిచింది. అయితే అనూహ్యంగా ఇషాన్ కిషన్కు మళ్లీ అవకాశం కల్పించడంతో పాటు, ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాను తుది జట్టులోకి తీసుకోవడం విమర్శలకు దారి తీసింది.హర్షిత్ రాణా ఎంపికపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రంజీ ట్రోఫీలో కూడా స్థిరంగా రాణించలేదన్న అభిప్రాయం ఉండగానే, అతడిని నేరుగా ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవడం సరైన నిర్ణయమా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం ‘వ్యక్తి కాదు.. జట్టే ముఖ్యం’ అన్న తన సిద్ధాంతంతో హర్షిత్కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు సమాచారం.
ఇప్పటి వరకు హర్షిత్ రాణా భారత్ తరఫున 6 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అందులో 7 వికెట్లు తీసినప్పటికీ, అతని ప్రదర్శన స్థిరంగా లేదన్న విమర్శలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో ఒక మ్యాచ్లో మెరుపులు మెరిపించినా, మిగతా అవకాశాలను పూర్తిగా వినియోగించుకోలేకపోయాడు. అయినప్పటికీ గంభీర్ అతనిపై నమ్మకం ఉంచి ప్రపంచకప్ జట్టులోకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.మొత్తానికి ఈ టీ20 ప్రపంచకప్ జట్టు ఎంపికపై అభిమానులు, క్రికెట్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విమర్శలు, అనుమానాల మధ్య హర్షిత్ రాణా ఎంపికను గంభీర్ ఎలా సమర్థించుకుంటాడో, అలాగే ప్రపంచకప్లో ఆ యువ బౌలర్ తనపై ఉన్న ఒత్తిడిని తట్టుకుని ఎలా రాణిస్తాడో చూడాల్సిందే.