కుదురుపల్లి అంగన్వాడీలో నాణ్యత లేని కోడిగుడ్లు.
పిల్లల ఆరోగ్యంపై అధికారుల నిర్లక్ష్యమా.? తల్లిదండ్రుల ఆగ్రహం..
జనం వాయిస్, మహాదేవపూర్, జూలై 10:
జయ శంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కుదురుపల్లి గ్రామంలో ప్రభుత్వం పిల్లల పోషణ కోసం కేటాయిస్తున్న కోడిగుడ్ల పంపిణీలో అలసత్వం కొనసాగుతోంది. కుదురుపల్లి అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న గుడ్ల నాణ్యతపై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత కొంత కాలంగా కేంద్రంలో ఇస్తున్న గుడ్లు పాతవిగా, కుళ్లిన వాసనతో, పలుచగా ఉన్నాయని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. పోషకాహారం కోసమని గుడ్డు ఇస్తే, అదే పిల్లలకు అనారోగ్యం తెస్తోంది. కొన్ని గుడ్లు పగలగొట్టగానే నల్లగా ఉంటున్నాయి. ఇలాంటివి పిల్లలకు ఎలా పెడతాం అని ఓ తల్లి ప్రశ్నించింది. ప్రతిరోజు అంగన్వాడీకి వచ్చే చిన్నారులకు ఇదే పరిస్థితి నెలకొందని, పలుమార్లు టీచర్ దృష్టికి తీసుకెళ్లినా మార్పు లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. సరఫరా చేసే ఏజెన్సీ నుంచే సరిగా రావడం లేదా, నిల్వలో నిర్లక్ష్యమా అనేది తెలియడం లేదు. పిల్లల భవిష్యత్ దృష్ట్యా వెంటనే స్పందించాలని, నాణ్యమైన తాజా గుడ్లను మాత్రమే సరఫరా చేయాలని సీడీపీఓ, ఐసీడీఎస్ అధికారులకు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. “ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ ఆ లబ్ధి పిల్లలకు అందడం లేదు. ప్రతి గుడ్డును చెక్ చేసి, నాణ్యత నిర్ధారించిన తర్వాతే పంపిణీ చేయాలి” అని వారు డిమాండ్ చేశారు. ఈ అంశంపై సంబంధిత అధికారులు వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, వాపోయారు
పిల్లల కడుపు నింపే పథకమే, వారి ఆరోగ్యంతో చెలగాటమాడితే ఎలా? అన్నది ఇప్పుడు కుదురుపల్లిలో ప్రతి ఇంటి ప్రశ్నగా మారింది