అవినీతి నిర్మూలనకు కలిసివద్దాం.
– వరంగల్లో ఏసీబీ ర్యాలీలో కమిషనర్ సున్ప్రీత్ సింగ్.
– అవినీతి నిరోధక వారోత్సవం నిర్వహిస్తున్న తెలంగాణ ఏసీబీ.
జనం వాయిస్,వరంగల్,డిసెంబర్ 08:
అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం (డిసెంబర్ 9) సందర్భంగా,ఈ నెల 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ రాష్ట్రవ్యాప్తంగా “అవినీతి నిరోధక వారోత్సవం” నిర్వహిస్తోంది. ప్రజల్లో అవగాహన పెంపుతో పాటు, అవినీతిని అరికట్టడానికి సంయుక్త చర్యలు అవసరమనే భావనను సమాజం ముందుకు తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిలిచింది.ఈ కార్యక్రమంలో భాగంగా వరంగల్లో అవినీతి వ్యతిరేక ర్యాలీ నిర్వహించబడింది.ఈ ర్యాలీలో వరంగల్ పోలీస్ కమిషనర్ సున్ప్రీత్ సింగ్ ఐపీఎస్ పాల్గొని,విద్యార్థులు,ఏసీబీ అధికారులు మరియు ఇతర పోలీస్ సిబ్బందితో కలిసి నినాదాలు చేశారు.అవినీతి వ్యతిరేక సందేశాలతో కూడిన బ్యానర్లు, అవగాహన నినాదాలు, 1064 టోల్ ఫ్రీ నంబర్పై ప్రచారం ఈ ర్యాలీ విశేషంగా నిలిచింది.ప్రజలు, ముఖ్యంగా యువత, అవినీతి పెరుగుదలను అరికట్టడంలో కీలక పాత్ర పోషించాలని కమిషనర్ పిలుపునిచ్చారు.”ప్రతి పౌరుడూ అవినీతి వ్యతిరేకంగా స్పందిస్తేనే వ్యవస్థ మారుతుంది. లంచం డిమాండ్ చేసే వారిని భయపడకుండా ఎవరైనా 1064 కు డయల్ చేయాలి,” అని ఆయన పేర్కొన్నారు. ఫిర్యాదు దారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడుతాయని అధికారులు భరోసా ఇచ్చారు.అవినీతి నిర్మూలన బాధ్యత ప్రభుత్వం, సంస్థలు మాత్రమే కాకుండా సామాజిక బాధ్యత కూడా కావాలని స్పష్టం చేస్తూ, ఏసీబీ అధికారులు ప్రజల్లో నైతిక విలువలు, బాధ్యతాభావం పెంపు అవసరాన్ని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు, ప్రచార ర్యాలీలు, చర్చలు నిర్వహించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధమయ్యాయి.ప్రజలు అవినీతి నిరోధక చర్యల్లో చురుకుగా పాల్గొంటేనే సమాజంలో స్వచ్ఛత, పారదర్శకత పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రచారాన్ని మరింత విస్తరింపజేయాలని ఏసీబీ లక్ష్యంగా పెట్టుకుంది.