janamvoice.com
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 8:30 am Digital Edition : GATTU MAHESH

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.

– స్పీకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.
– ఇదే చివరి అవకాశం అంటూ స్పష్టీకరణ.
– రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశం.

జనం వాయిస్, తెలంగాణ:

ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ధర్మాసనం, ఈ అంశంపై ఇప్పటికే తగినంత సమయం ఇచ్చామని స్పష్టం చేసింది. ఇక ఇదే చివరి అవకాశమని, మరింత ఆలస్యం సహించబోమని హెచ్చరించింది.
మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై రెండు వారాల్లోగా స్పీకర్ తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిర్ణయం తీసుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టంగా పేర్కొంది. అవసరమైతే తామే నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అనర్హత అంశంపై ఇప్పటివరకు తీసుకున్న చర్యల వివరాలతో రెండు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిరాయింపులపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి విషయాలను నిర్లక్ష్యం చేయలేమని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఈ కేసు విచారణను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. తదుపరి విచారణలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం, సమర్పించే అఫిడవిట్ ఆధారంగా తదుపరి చర్యలు నిర్ణయిస్తామని ధర్మాసనం తెలిపింది. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.