కేరళలో పద్మనాభస్వామి ఆలయాన్ని దర్శించిన టీమిండియా సభ్యులు.
జనం వాయిస్, తిరువనంతపురం:
న్యూజిలాండ్తో జరగనున్న చివరి టీ20 మ్యాచ్కు ముందు భారత క్రికెట్ జట్టు సభ్యులు కేరళలోని చారిత్రక శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో స్వామివారి సన్నిధికి చేరుకున్న ఆటగాళ్లు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు ఆల్రౌండర్ అక్షర్ పటేల్, బ్యాటర్ రింకు సింగ్, స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ ఆలయ దర్శనంలో పాల్గొన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్లో భారత్ ఇప్పటికే 3–1 ఆధిక్యంతో న్యూజిలాండ్పై విజయం సాధించింది. అయితే నాలుగో మ్యాచ్లో ఓటమి పాలైన నేపథ్యంలో చివరి పోరులో గెలిచి సిరీస్ను ఘనంగా ముగించాలని జట్టు పట్టుదలగా ఉంది. ఈ సిరీస్ ఆరంభం నుంచే భారత ఆటగాళ్లు వివిధ ప్రాంతాల్లో ఆలయాలను సందర్శిస్తూ వస్తున్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్కు ముందు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని కూడా దర్శించుకున్నారు. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న 2026 టీ20 ప్రపంచకప్కు సన్నాహాల్లో భాగంగా ఈ సిరీస్ కొనసాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత్, ఈ టోర్నీలో తన తొలి మ్యాచ్ను అమెరికాతో ఆడనుంది.