Date of Publish : 19 February 2026, 4:02 pmDigital Edition : JANAM VOICE
తెలంగాణ ఎవరి జాగీరు కాదు: కడియం శ్రీహరి ధ్వజం.
తెలంగాణ ఎవరి జాగీరు కాదు: కడియం శ్రీహరి ధ్వజం.
జాతిపిత దేశానికి మహాత్మాగాంధీ మాత్రమేనని వ్యాఖ్య.
తెలంగాణ ఉద్యమం అందరిదని స్పష్టం
కేసీఆర్పై ఘాటు విమర్శలు చేసిన ఎమ్మెల్యే.
జనం వాయిస్, హైదరాబాద్:
తెలంగాణ సెంటిమెంట్ను వాడుకుని ఇంకా ఎన్ని రోజులు రాజకీయం చేస్తారని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావుపై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కల్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశానికి జాతిపిత ఒకరేనని, అది మహాత్మాగాంధీ మాత్రమేనని పేర్కొన్నారు. తెలంగాణ ఎవరి జాగీరు కాదని, తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ జాతిపిత ఎలా అవుతారని ప్రశ్నించారు. జాతిపిత అని చెప్పుకోవడం సరికాదని, ప్రజల్లోకి వచ్చి సమస్యలపై స్పందించాలని సూచించారు. తన పాలనలో అవకతవకలు, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాల వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారని విమర్శించారు. ప్రజలు అధికారంలో నుంచి దింపినప్పటికీ ఇంకా అహంకారం తగ్గలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకున్నారని, ఇకపై సెంటిమెంట్ రాజకీయాలు పనిచేయవని కడియం శ్రీహరి పేర్కొన్నారు.