భక్తి కి భద్రత కరువు..
– భయం పుట్టిస్తున్న దేవాలయాలు!
– ప్రతీసారి అదే దృశ్యం.. బలైపోతున్న భక్తులు
– దేవాలయాల్లో భద్రతా చర్యలు తప్పనిసరి
జనం వాయిస్ వెబ్:
దేవుడిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం దేశానికి శోచనీయ విషయం. నిన్న శ్రీకాకులం జిల్లా కాసిబుగ్గలోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట మళ్లీ ఒక చేదు సత్యాన్ని వెలుగులోకి తెచ్చింది — దేవాలయాల్లో భద్రతా ఏర్పాట్లు ఎంత నిర్లక్ష్యంగా జరుగుతున్నాయో ఇది మరోసారి రుజువు చేసింది. భక్తుల ఉత్సాహం, అధికారులు చూపిన నిర్లక్ష్యం కలిసి ప్రాణాలను బలిగొన్నాయి.ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా తిరుమల, సబరిమల, పాండురంగ క్షేత్రం వంటి ప్రముఖ దేవాలయాల్లో కూడా తొక్కిసలాటలు జరిగి వందలాది ప్రాణాలు కోల్పోయారు. పండుగలు, ప్రత్యేక దినాలు, ఎకాదశి వంటి సందర్భాల్లో భక్తుల రద్దీ పెరుగుతుందని తెలిసినా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయి. ప్రాణాలకు విలువ లేకుండా దేవాలయ నిర్వహణలు వ్యవహరించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం కేవలం పరిహారం ప్రకటించడం కాకుండా, దేవాలయాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలులోకి తేవాలి. భక్తుల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను స్పష్టంగా గుర్తించి, రద్దీని నియంత్రించే క్రమంలో తగిన సిబ్బంది నియమించాలి. ఎక్కడైనా ప్రమాద సూచనలు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకునే వ్యవస్థ ఉండాలి.ప్రజలకూ అవగాహన అవసరం. ఒకే సారి వేలమంది పరుగెత్తి వెళ్లడం, తోపులాట చేయడం అనేది ప్రమాదానికి దారి తీస్తుంది. భక్తి పూజలతో పాటు శాంతియుత ప్రవర్తన కూడా అంతే ముఖ్యం అని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం, దేవస్థాన అధికారులు, భక్తులు ఈ ముగ్గురూ తమ తమ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు నివారించవచ్చు.