తెలంగాణలో టీజీ20 లీగ్ సందడి.
జనం వాయిస్, హైదరాబాద్, మే 24:
దేశవ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లేఆఫ్స్ ఉత్కంఠ రేపుతున్న వేళ తెలంగాణ క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు ఐపీఎల్ తరహాలోనే ‘టీజీ20 లీగ్’ నిర్వహణకు సిద్ధమైంది.
ఈ ప్రతిష్టాత్మక లీగ్లో తెలంగాణకు చెందిన 8 ప్రాంతీయ జట్లు పాల్గొననున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల పేర్లతో జట్లు బరిలోకి దిగనున్నాయి. టోర్నీ జూన్ 20న ప్రారంభమై జూలై 11న ఫైనల్తో ముగియనుంది. ఇక ఆటగాళ్ల వేలాన్ని జూన్ 7న నిర్వహించనున్నట్లు హెచ్సీఏ ప్రకటించింది.
ఫ్రాంచైజీల బిడ్డింగ్లో కార్పొరేట్ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఇందులో హైదరాబాద్ జట్టును ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.7.5 కోట్లకు దక్కించుకుంది. రంగారెడ్డి జట్టును బూరుగు ఇన్ఫ్రా మరియు ప్రణవ సంస్థలు రూ.7.2 కోట్లకు కొనుగోలు చేశాయి.
వరంగల్ జట్టును బైన్ గ్లోబల్ రిసోర్సెస్ రూ.6.55 కోట్లకు, మెదక్ జట్టును బృందా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ రూ.6.33 కోట్లకు సొంతం చేసుకున్నాయి.
ఇక నల్గొండ జట్టును కిశోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ రూ.5.06 కోట్లకు, కరీంనగర్ జట్టును ఈఐపీఎల్ గ్రూప్ మరియు తిబరుమాల్ సంస్థలు రూ.4.57 కోట్లకు దక్కించుకున్నాయి.
మహబూబ్నగర్ జట్టును వీరభద్ర స్టీల్స్ రూ.4.5 కోట్లకు కొనుగోలు చేయగా, ఖమ్మం జట్టును అన్విత గ్రూప్ రూ.4.44 కోట్లకు సొంతం చేసుకుంది.
ఈ లీగ్ ద్వారా తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన క్రికెటర్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.