janamvoice.com
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 12:31 pm Digital Edition : JANAM VOICE

అమెరికా ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది: రాహుల్ గాంధీ.<br>

అమెరికా ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది: రాహుల్ గాంధీ.

వాణిజ్య ఒప్పందం భారత్‌కు నష్టం చేస్తుందన్న విమర్శ.
కృత్రిమ మేధ, డేటా భద్రతపై లోక్‌సభలో ఆందోళన.

జనం వూ, న్యూఢిల్లీ:

అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం దేశ ప్రయోజనాలకు విరుద్ధమని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా లోక్‌సభలో మాట్లాడుతూ, ఈ ఒప్పందం పూర్తిగా అమెరికాకు మేలు చేసేలా ఉందని, భారత్‌కు స్పష్టమైన లాభం కనిపించడం లేదని విమర్శించారు. ప్రపంచంలో వేగంగా మారుతున్న పరిస్థితులను బడ్జెట్ ప్రతిబింబించలేదని అన్నారు. ప్రపంచం కృత్రిమ మేధ యుగంలోకి అడుగుపెడుతోందని, దీనివల్ల భారత ఐటీ రంగం, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడవచ్చని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కృత్రిమ మేధకు ఇంధనం డేటా అని, భారత యువత మరియు వారి డేటా దేశానికి అతిపెద్ద ఆస్తి అని తెలిపారు. అమెరికా కంపెనీలకు పన్ను రాయితీలు ఇస్తూ, దేశ డేటా భద్రతపై సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అమెరికా సూచనల మేరకే భారత్ చమురు కొనుగోళ్లు, దిగుమతులు నిర్ణయించుకుంటోందని ఆయన ఆరోపించారు. ఒకప్పుడు భారత ఉత్పత్తులపై తక్కువ శాతం పన్ను ఉండగా, ఇప్పుడు అది పెరిగిందని అన్నారు. అమెరికా దిగుమతులు గణనీయంగా పెరిగినప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థకు ఈ ఒప్పందం భరోసా ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. ప్రసంగం సమయంలో కొన్ని ఇతర అంశాలను ప్రస్తావించడంపై సభలో గందరగోళం నెలకొంది. అధికారపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా, సభాధ్యక్షుడు బడ్జెట్ అంశాలకే పరిమితమవ్వాలని సూచించారు. చివరగా కేంద్ర ప్రభుత్వం అమెరికాకు తలొగ్గిందని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ముగించారు.