సర్వభ్రష్ట బీఆర్ఎస్.. తెలంగాణను సర్వనాశనం చేసింది: కవిత.
– పద్ధతి, ప్రజాస్వామ్యం, నైతికత లేని పార్టీ.
- అధికారంలోనూ, ప్రతిపక్షంలోనూ ఘోర వైఫల్యం.
- అసెంబ్లీలో బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు.
జనం వాయిస్, హైదరాబాద్:
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను సర్వనాశనం చేసిన సర్వభ్రష్ట రాజకీయ శక్తిగా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆమె, బీఆర్ఎస్కు పద్ధతి లేదని, ప్రజాస్వామ్య విలువలు లేవని, నైతికత పూర్తిగా క్షీణించిందని ఆరోపించారు. అవినీతినే ఎజెండాగా పెట్టుకుని పాలన సాగించిన పార్టీ బీఆర్ఎస్ అని కవిత మండిపడ్డారు. అడుగడుగునా తెలంగాణకు ద్రోహం చేశారని, పదేళ్ల పాలనలో రాష్ట్రానికి శాశ్వతంగా ఉపయోగపడే ఒక్క బలమైన పునాది కూడా వేయలేకపోయారని విమర్శించారు. అధికారపక్షంగా పూర్తిగా ఫెయిల్ అయిన బీఆర్ఎస్, ఇప్పుడు ప్రతిపక్షంగా కూడా ప్రజల సమస్యలపై పోరాడలేకపోతోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆశలు, ఆకాంక్షలను తుంగలో తొక్కిన పార్టీగా బీఆర్ఎస్ చరిత్రలో మిగిలిపోతుందని కవిత అన్నారు. ప్రజాస్వామ్యం, విలువలు, బాధ్యత లేని రాజకీయాల వల్లే రాష్ట్రం ఎన్నో నష్టాలు చవిచూసిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తికి పూర్తిగా విరుద్ధంగా బీఆర్ఎస్ పాలన సాగిందని ఆమె విమర్శించారు. మొత్తంగా బీఆర్ఎస్ ఒక సర్వభ్రష్ట పార్టీగా ప్రజల ముందుకు బహిర్గతమైందని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల తరఫున నిజాలను బయటపెట్టడమే తన బాధ్యత అని, ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాటం కొనసాగుతుందని అసెంబ్లీలో స్పష్టమైన సందేశం ఇచ్చారు.