Date of Publish : 10 March 2026, 12:16 pmDigital Edition : JANAM VOICE
డబ్బుల కోసం పసికందును అమ్మేసిన దంపతులు.
డబ్బుల కోసం పసికందును అమ్మేసిన దంపతులు.
వారం రోజుల శిశువు విక్రయం.
అంగన్వాడీ ఉపాధ్యాయురాలి అప్రమత్తతతో బయటపడిన ఘటన.
రూ.1.7 లక్షలకు శిశువును విక్రయించినట్లు అంగీకారం.
జనం వాయిస్, మెదక్, మార్చి 10:
మెదక్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. డబ్బుల కోసం కన్నపేగు బంధాన్ని కాసులకు అమ్ముకున్న ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పుట్టిన వారం రోజులకే తమ మగబిడ్డను విక్రయించి మానవత్వానికే మచ్చ తెచ్చిన ఘటన హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో జరిగింది. ఈ సంఘటన బయటపడటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం, లింగసానిపల్లి తండాకు చెందిన ఓ గిరిజన దంపతులకు గత నెల 10వ తేదీన మగబిడ్డ జన్మించాడు. అయితే ఆర్థిక ఇబ్బందులను కారణంగా చూపుతూ పుట్టిన వారం రోజులకే ఆ పసికందును కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ దంపతులకు విక్రయించినట్లు తెలిసింది. ఈ ఘటన అంగన్వాడీ ఉపాధ్యాయురాలి అప్రమత్తతతో వెలుగులోకి వచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి అంగన్వాడీ కేంద్రానికి గుడ్లు, ఇతర పోషకాహారం తీసుకోవడానికి రాకపోవడంతో ఉపాధ్యాయురాలికి అనుమానం కలిగింది. దీంతో ఆమె వారి ఇంటికి వెళ్లి చూడగా తలుపులకు తాళం వేసి ఉండటం గమనించారు. వెంటనే ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగారు. దర్యాప్తులో ఆ గిరిజన దంపతులు మరో గ్రామంలో ఉన్నట్లు గుర్తించారు. వారిని పట్టుకుని బిడ్డ గురించి ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. తమ మగబిడ్డను రూ.1.7 లక్షలకు కామారెడ్డి జిల్లాకు చెందిన దంపతులకు అమ్మేసినట్లు వారు ఒప్పుకున్నారు. దీంతో ఐసీడీఎస్ అధికారులు వారిని హవేలీఘనాపూర్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.