janamvoice.com
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 7:40 pm Digital Edition : JANAM VOICE

శాంతిభద్రతలపై ప్రభుత్వం విఫలం.

శాంతిభద్రతలపై ప్రభుత్వం విఫలం.

– షాబాద్ ఘటనపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు.
– పోక్సో కేసుల నియంత్రణపై ప్రశ్నలు.
– నిందితుడిని వెంటనే పట్టుకోవాలని డిమాండ్.

జనం వాయిస్, హైదరాబాద్, జూలై 11:

షాబాద్ మండలంలో జరిగిన ఆరు హత్యల ఘటనపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, పోక్సో కేసుల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రి సమయంలో షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన వరుస హత్యలు రాష్ట్ర ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయని అన్నారు. ఆరుగురిని హత్య చేసిన నిందితుడు ఇప్పటికీ పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉండటం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, చేవెళ్ల, వికారాబాద్ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. నిందితుడిని వెంటనే పట్టుకుని చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసు శాఖను డిమాండ్ చేశారు.
చిన్నారుల రక్షణ, మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పోక్సో కేసులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు పూర్తి రక్షణ కల్పించాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై వేగంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల్లో భద్రతాభావం కల్పించేలా పోలీసు వ్యవస్థ మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.