జనసేన నాయకుల మానవతా దృక్పథం.
– హత్యకు గురైన జనసైనికుడు కుటుంబానికి ఆర్థిక సహాయం.
– రూ. లక్ష చెక్కుల పంపిణీ.
– నాగబాబు సమక్షంలో ఉపాధి భరోసా.
– జనసేనలో సేవా సంస్కృతి స్పష్టం.
జనం వాయిస్, ఎచ్చెర్ల:
ఎచ్చెర్లలో హత్యకు గురైన జనసైనికుడు పుక్కాల రాజశేఖర్ కుటుంబానికి జనసేన నాయకులు మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు, జనసేన భీమిలి నియోజకవర్గం ఇన్చార్జి పంచకర్ల సందీప్ రూ.50 వేలు, ఎచ్చెర్ల నియోజకవర్గం పీఓసీ విశ్వక్ సేన్ రూ.50 వేలు చొప్పున మొత్తం రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. ఈ చర్యతో జనసేన నాయకుల మానవతా దృక్పథం మరోసారి స్పష్టమైంది.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు సోమవారం ఎచ్చెర్ల ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన శాసనమండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు సమక్షంలో చెక్కులను బాధిత కుటుంబానికి అందజేశారు. పార్టీ తరఫున బాధితులకు అండగా నిలవాలన్న సంకల్పంతో ఈ సహాయం అందించినట్లు నేతలు తెలిపారు.
హత్యకు గురైన రాజశేఖర్ సతీమణి హరిప్రియ ఇటీవల ఎచ్చెర్ల పర్యటనలో నాగబాబును కలిసి, సంబంధం లేని ఘర్షణలో తన భర్తను కోల్పోయిన బాధను వివరించారు. కుటుంబ పోషణ భారంగా మారిందని మొరపెట్టుకోవడంతో నాగబాబు అప్పటికప్పుడు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా ఉపాధి అవకాశాన్ని కూడా కల్పించారు. ఫిబ్రవరి నెల నుంచి హరిప్రియ ఉద్యోగంలో చేరనున్నట్లు తెలిపారు. జనసైనికుడు కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన పంచకర్ల సందీప్, విశ్వక్ సేన్లను నాగబాబు ప్రత్యేకంగా అభినందించారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తల కుటుంబాలకు జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ఇది కేవలం రాజకీయ బాధ్యత మాత్రమే కాక మానవతా కర్తవ్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.