మహనీయుల జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.
– డా. మార్షల్ దుర్గం నగేష్.
జనం వాయిస్, ఎన్టీపీసీ, డిసెంబర్ 22:
మహాత్మా జ్యోతిరావు ఫులే, రాజర్షి షాహూ మహారాజ్, డా. బి.ఆర్. అంబేడ్కర్ల భావజాలాన్ని ప్రజల్లో మరింత విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఫులే–షాహూ–అంబేడ్కర్ గాపక్ మహోత్సవాన్ని (మహనీయుల జాతర) విజయవంతం చేయాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. మార్షల్ దుర్గం నగేష్ పిలుపునిచ్చారు.డిసెంబర్ 24, 25 తేదీల్లో మహారాష్ట్ర గడ్చిరోలీ జిల్లా సిరొంచాలో జరగనున్న ఈ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా సోమవారం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని సమతా గ్రంథాలయంలో బుద్ధిష్టి సొసైటీ ఆఫ్ ఇండియా, బోధిసత్వ సమాజ్, మిలింద ట్రస్ట్, నేతకాని మహర్ సంఘం నాయకులతో కలిసి మహోత్సవ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు.అనంతరం డా. మార్షల్ దుర్గం నగేష్ మాట్లాడుతూ… ఫులే–షాహూ–అంబేడ్కర్లు ప్రతిపాదించిన సమానత్వం, సామాజిక న్యాయం, మానవ గౌరవం వంటి విలువలు నేటి సమాజానికి దిక్సూచిగా నిలుస్తున్నాయని తెలిపారు. వారి ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న ఈ మహోత్సవం సామాజిక చైతన్యాన్ని పెంపొందించే వేదికగా నిలుస్తుందన్నారు.తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి ప్రజలు ఈ మహనీయుల జాతరకు తరలిరానున్నారని, ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువతలో సామాజిక స్పృహ, సమానత్వ భావన మరింత బలపడుతుందని పేర్కొన్నారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సమతా ఫౌండేషన్, సమతా గ్రంథాలయ నిర్వాహకురాలు ప్రమీల నగేష్, బుద్ధిష్టి సొసైటీ ఆఫ్ ఇండియా నాయకులు కోలా శ్యామ్, బోధిసత్వ సమాజ్ అధ్యక్షులు హైదర్ వలి, మిలింద ట్రస్ట్ అధ్యక్షులు దుర్గం వెంకటి, సభ్యులు కావేరి శంకర్, ముడిమడుగుల నారాయణ, నేతకాని మహర్ సంఘం నాయకులు జాడి రాజేశం, సమతా సైనిక దళ్ సభ్యులు దుర్గం వెంకట నరసయ్య, నిఖిల్ సాయి, హరక్షిత తదితరులు పాల్గొన్నారు.