Date of Publish : 23 February 2026, 2:57 pmDigital Edition : JANAM VOICE
ఎక్కేది ఆర్డినరీ బస్సు కొట్టేది..ఎక్స్ ప్రెస్ టికెట్.
ఎక్కేది ఆర్డినరీ బస్సు కొట్టేది..ఎక్స్ ప్రెస్ టికెట్.
బస్సుల కొరత పేరిట ప్రయాణికుల పై భారం మోపుతున్న ఆర్టీసీ యాజమాన్యం.
మంథని డిపో మేనేజర్ పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి.
డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెెంకల సురేష్.
జనం వాయిస్, మంథని :
మంథని బస్సు డిపో నుండి పెద్దపల్లి, కరీంనగర్ వైపుగా వెళుతున్నటువంటి మంథని డిపో బస్సులు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నియమ నిబంధనలను పాటించకుండా మంథని డిపో అధికారులు ఇష్టమైన రీతిలో బస్సులను సంబంధిత రూట్లకు పంపిస్తున్నారు. సోమవారం మంథని నుండి కరీంనగర్ వెళ్తున్న TS22 T 7244 పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల వద్ద నుండి ఎక్స్ ప్రెస్ చార్జీలు వసూలు చేసి ప్రయాణికులను కొంత ఆశ్చర్యానికి గురి చేశారు. ఇదేంటని ప్రశ్నించిన కొందరు ప్రయాణికులకు బస్సు ఎక్కేముందే ఎక్స్ ప్రెస్ అని చెప్పాము కదా అని ఆ బస్సు కండక్టర్ సమాధానం చెప్పసాగారు. మంథని డిపో నుండి గత కొద్ది రోజులుగా పల్లవెలుగు ఆర్డినరి బస్సులను వేసి ఎక్స్ ప్రెస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని గతంలో తెలిపినప్పటికి మంథని డిపో యాజమాన్యం తీరు మారడం లేదు. పల్లెవెలుగు బస్సులు వేసి ఎక్స్ ప్రెస్ చార్జీలు వసూలు చేస్తు పేద మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొడుతున్న మంథని బస్సు డిపో మేనేజర్ పై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ఇలాంటివి తిరిగి పునరావృతం కాకుండా మంథని నుండి ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఆర్టీసీ చార్జీల పేరిట ఇబ్బందులకు గురి చేయవద్దని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్ డిమాండ్ చేశాడు.