నా ఓటు వేరేవారు వేశారు అంటూ మహిళ ఆగ్రహం.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఘటన.
పోలింగ్ కేంద్రంలోనే బయటపడిన వ్యవహారం.
సిబ్బందిని నిలదీసిన పారిజాతం.
జనం వాయిస్, రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 11:
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 15వ వార్డులో ఓటు వేయడానికి వెళ్లిన పారిజాతం అనే మహిళకు షాక్ తగిలింది. పోలింగ్ కేంద్రానికి వెళ్లి తన పేరు చెప్పగా, ఇప్పటికే మీ ఓటు నమోదైందని సిబ్బంది తెలిపినట్లు ఆమె ఆరోపించారు. ఈ విషయంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన పారిజాతం, తన వద్ద ఉన్న గుర్తింపు పత్రాలు చూపించినప్పటికీ, ఓటు ముందే నమోదైందని అధికారులు చెప్పారని వెల్లడించారు. తన హక్కైన ఓటును వేరేవారు వేయడం ఎలా జరిగిందని ప్రశ్నించారు. అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, అయినా వేరే వ్యక్తులు ఓటు వేస్తుంటే పోలింగ్ సిబ్బంది ఏమి చేస్తున్నారని ఆమె నిలదీశారు. ఓటర్ల జాబితా ధృవీకరణ, గుర్తింపు ప్రక్రియ సక్రమంగా నిర్వహించలేదని ఆరోపించారు. ఈ ఘటనపై స్థానిక అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఓటు హక్కు అత్యంత ప్రాధాన్యమైన ప్రజాస్వామ్య హక్కు కావడంతో, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.