అన్నం పెట్టిన ఇంటికే కన్నం.
– రూ.18 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాహా.
జనం వాయిస్, బెంగళూరు:
బెంగళూరులోని మారథహల్లి ప్రాంతంలో భారీ దోపిడీ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. భర్తతో కలిసి ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి యజమాని ఇంటికే కన్నం వేసి కోట్ల రూపాయల ఆస్తిని దోచుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం, శివకుమార్ అనే బిల్డర్ ఇంట్లో పని చేసేందుకు తొమ్మిది నెలల క్రితం నేపాల్కు చెందిన దినేష్, కమల, అంబికలు వచ్చారు. వీరు ఇంట్లో నమ్మకంగా పని చేస్తూ కుటుంబ సభ్యుల కదలికలపై పూర్తి అవగాహన సంపాదించారు. ఈ క్రమంలో శివకుమార్ కుటుంబం ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కోసం బయటకు వెళ్లిన సమయంలో, పనిమనిషి అంబిక భర్తతో పాటు మరో ముగ్గురితో కలిసి ఇంట్లోకి చొరబడి దోపిడీకి పాల్పడింది. ఇంట్లో ఉన్న లాకర్లు, అల్మారాలను తెరిచి విలువైన ఆభరణాలు, నగదును కొల్లగొట్టారు. ఈ ఘటనలో మొత్తం 11.5 కిలోల బంగారు ఆభరణాలు, వజ్రాలు, 5 కిలోల వెండి వస్తువులు, రూ.11.5 లక్షల నగదును దోచుకుని నిందితులు పరారైనట్లు పోలీసులు తెలిపారు. మొత్తం దోపిడీ విలువ సుమారు రూ.18 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్లు, సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటన నగరంలో తీవ్ర చర్చకు దారి తీసింది.