janamvoice.com
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 12:38 pm Digital Edition : JANAM VOICE

హైదరాబాద్‌లో మార్చాల్సింది చాలా ఉంది!

హైదరాబాద్‌లో మార్చాల్సింది చాలా ఉంది!

జనం వాయిస్, వెబ్ డెస్క్:

భాగ్యనగర పరిశుభ్రతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో జిహెచ్ఎంసి యంత్రాంగంలో ఒక్కసారిగా చలనం వచ్చింది ఐఏఎస్ అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరూ రోడ్లపైకి వచ్చారు. గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా చెత్త తొలగింపు, డ్రైనేజీ క్లీనింగ్ పనుల వద్ద అధికారులు నిలబడి ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. అయితే, ఈ హడావుడి కేవలం సీఎం ఆగ్రహానికి భయపడి చేస్తున్న తాత్కాలిక ప్రయత్నమా లేక రాబోయే గ్రేటర్ ఎన్నికల స్టంటా అన్నది నగర వాసులకు అనుమానంగానే ఉంది.

పేరుకుపోయిన సమస్యలు – పట్టించుకోని గతం

గత రెండేళ్లుగా హైదరాబాద్‌లో పారిశుధ్యం పడకేసింది. ప్రధాన రహదారుల నుంచి గల్లీల వరకు గుంతలమయమైన రోడ్లు వాహనదారుల పాలిట నరకంగా మారాయి. వీధి దీపాల పరిస్థితి మరీ దారుణం.. సగానికి పైగా లైట్లు వెలగక రాత్రివేళల్లో నగరవాసులు చీకట్లోనే ప్రయాణించాల్సి వస్తోంది. చిన్న చిన్న పౌర సమస్యలను కూడా పరిష్కరించడంలో యంత్రాంగం వైఫల్యం చెందడం వల్లే నేడు నగరం తన క్లీన్ ఇమేజ్ ను కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతోనే యంత్రాంగం మేల్కొన్నట్లు కనిపిస్తోంది.

పర్యాటక ప్రాంతాల నిర్లక్ష్యం

హైదరాబాద్‌కు తలమానికంగా నిలిచే టూరిజం హాట్ స్పాట్లు కూడా అధికారుల నిర్లక్ష్యానికి గురయ్యాయి. చారిత్రక కట్టడాల పరిసరాల్లో చెత్తాచెదారం, అస్తవ్యస్తమైన ఫుట్‌పాత్‌లు పర్యాటకులకు చేదు అనుభవాన్ని మిగులుస్తున్నాయి. ప్రపంచస్థాయి నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో పారిశుధ్య నిర్వహణ ఇంత అధ్వాన్నంగా ఉండటం పాలనా లోపాలను ఎత్తిచూపుతోంది. కేవలం ముఖ్యమంత్రి సమీక్ష చేసినప్పుడు మాత్రమే కాకుండా, నిరంతరం పర్యవేక్షణ ఉంటేనే ఈ ప్రాంతాలకు పూర్వవైభవం వస్తుంది.

శాశ్వత పరిష్కారం వైపు అడుగులేవి?

అధికారులు ఇప్పుడు చేస్తున్న పనులు తాత్కాలికంగా సమస్యలను మరుగున పడేయవచ్చు కానీ, నగరానికి ఒక క్రమబద్ధమైన, శాశ్వతమైన వ్యవస్థ అవసరం. డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, రోడ్ల రీ-కార్పెటింగ్ , చెత్త సేకరణలో అత్యాధునిక సాంకేతికతను వాడటం ద్వారానే హైదరాబాద్‌ను సుందర నగరంగా మార్చగలరు. కేవలం ఫోటోల కోసం కాకుండా, పౌరుల జీవన ప్రమాణాలను పెంచే దిశగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి. అప్పుడే ముఖ్యమంత్రి ఆశించిన క్లీన్ సిటీ కల సాకారమవుతుంది.