janamvoice.com
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 2:13 pm Digital Edition : GATTU MAHESH

ఇది కేవలం క్రికెట్ కాదు.. రూ.4500 కోట్ల వ్యాపారం.

ఇది కేవలం క్రికెట్ కాదు.. రూ.4500 కోట్ల వ్యాపారం.

– భారత్–పాక్ మ్యాచ్‌పై సర్వత్ర ఉత్కంఠ.!

జనం వాయిస్, కొలంబో:

టీట్వెంటీ ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఇప్పుడు కేవలం క్రీడా పోరాటంగా కాకుండా భారీ ఆర్థిక అంశంగా మారింది. ఈ ఒక్క మ్యాచ్ విలువ సుమారు రూ.4500 కోట్లుగా అంచనా వేయబడుతోంది. ప్రసార హక్కులు, ప్రకటనలు, స్పాన్సర్‌షిప్, టికెట్ అమ్మకాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలు కలిపి ఈ స్థాయి వ్యాపారం జరుగుతుందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఈ మ్యాచ్‌ను టోర్నమెంట్‌కు వెన్నుదన్నుగా భావిస్తారు.
పాకిస్థాన్ భారత్‌తో మ్యాచ్ ఆడబోమని వెనుకడుగు వేయడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి తీవ్రంగా స్పందించింది. ఇది రాజకీయ అంశం కాదని, భారీ ఆర్థిక నష్టాలకు దారి తీసే నిర్ణయమని హెచ్చరించింది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే ప్రసార సంస్థలకు ఒక్క మ్యాచ్ ద్వారానే రూ.300 కోట్లకు పైగా ప్రకటనల ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో ప్రసార సంస్థలు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఈ మ్యాచ్ రద్దు ప్రభావం కేవలం ప్రసారకర్తలకే కాకుండా క్రికెట్ బోర్డులపై కూడా పడనుంది. అంచనాల ప్రకారం భారత్, పాకిస్థాన్ బోర్డులకు చెరో రూ.200 కోట్ల మేర ప్రత్యక్ష, పరోక్ష నష్టం వాటిల్లే అవకాశం ఉంది. భారత్ ఈ నష్టాన్ని భరించగలిగినా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు మాత్రం ఇది తీవ్ర దెబ్బగా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆదాయంలో పాకిస్థాన్‌కు ఏడాదికి గణనీయమైన వాటా లభిస్తోంది. నిబంధనలను ఉల్లంఘించి స్వచ్ఛందంగా మ్యాచ్‌కు దూరమైతే ఆ నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు జరిమానాలు, చట్టపరమైన సమస్యలు, భవిష్యత్తులో టోర్నమెంట్ల నిర్వహణ అవకాశాలు కోల్పోయే పరిస్థితి కూడా తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు.
ఆర్థిక నష్టాల కంటే పెద్ద సమస్య ప్రతిష్ఠకు భంగం కలగడమేనని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకసారి పాకిస్థాన్ మ్యాచ్‌లు ప్రమాదకరంగా భావించబడితే భవిష్యత్తులో ప్రసార హక్కుల విలువ తగ్గడం, స్పాన్సర్లు వెనక్కి తగ్గడం తప్పదని అంటున్నారు. ఈ ఒక్క నిర్ణయం పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తుపై దీర్ఘకాల ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.