janamvoice.com
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 5:01 pm Digital Edition : GATTU MAHESH

మున్సిపల్ ఎన్నికలకు కట్టు దిట్టమైన ఏర్పాట్లు.- రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని.

మున్సిపల్ ఎన్నికలకు కట్టు దిట్టమైన ఏర్పాట్లు.

– రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని.

– మున్సిపల్ ఎన్నికల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమీషనర్.

జనం వాయిస్, వెబ్ డెస్క్, ఫిబ్రవరి 02:

మున్సిపల్ ఎన్నికలకు కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు. మున్సిపల్ ఎన్నికల పై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని జిల్లా కలెక్టర్ లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.కలెక్టరేట్ ల నుంచి ఆయా జిల్లా కలెక్టర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ పురపాలక ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రకటన, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు నిబంధనల ప్రకారం జరగాలని అన్నారు. పోలింగ్ కు అవసరమైన మేర బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని, పోలింగ్ బృందాలు , డిస్ట్రిబ్యూషన్,  రిసెప్షన్ కేంద్రాలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద స్ట్రాంగ్ రూమ్ లలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత మున్సిపాలిటీలలో చైర్ పర్సన్, కార్పొరేషన్లలో మేయర్ ఎన్నిక కోసం ఫారం 2 లను సిద్ధం చేసి సంసిద్ధం కావాలని, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులకు ముందుగానే సమాచారం అందించాలని అన్నారు.