janamvoice.com
Newspaper Banner
Date of Publish : 02 November 2025, 5:00 pm Digital Edition : GATTU MAHESH

కాంగ్రెస్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలి: మహేష్ కుమార్ గౌడ్

కాంగ్రెస్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలి: మహేష్ కుమార్ గౌడ్

జనం వాయిస్,హైదరాబాద్‌, నవంబర్‌ 2:

త్వరలో జరగబోతున్న జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ ఉప ఎన్నిక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి కీలక పరీక్షగా భావించాలని ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. “గత రెండేళ్లుగా మన ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో అమలు చేస్తున్న పథకాలు ప్రజల మనసులను గెలుచుకున్నాయి. ఇప్పుడు ఆ విజయవంతమైన పాలన ఫలితాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలి” అని అన్నారు.ఆయన కార్యకర్తలకు సూచిస్తూ.. “మీ పరిధిలో ఉన్న స్నేహితులు, బంధువులు, పరిచయస్తులతో వ్యక్తిగతంగా సంప్రదించి, కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమం గురించి వివరించండి. నవీన్ యాదవ్ గారికి ఓటు వేయడం ద్వారా అభివృద్ధి కొనసాగింపుకు మద్దతు ఇవ్వాలని ప్రజలను ఒప్పించండి” అని పిలుపునిచ్చారు. “ఉప ఎన్నిక ప్రచారానికి ఇంకా వారం రోజులు మాత్రమే ఉన్నాయి. ఇది చాలా కీలకమైన సమయం. ప్రతి ఒక్క కార్యకర్త తానే అభ్యర్థి అనుకున్నట్టుగా కష్టపడి, ప్రచారంలో చురుకుగా పాల్గొంటే, కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ విజయతీరాలకు చేర్చడంలో మనందరం ఒక కుటుంబంలా కృషి చేద్దాం” అని అన్నారు.