పెట్రోల్ బంక్లోకి ట్రాక్టర్ సడన్ టర్న్. ఉపాధ్యాయుల వాహనం ఢీ..
• గంటపాటు వాహనంలో చిక్కుకున్న టీచర్.. జేసీబీతో బయటకు.
• మాందారిపేటలో కలకలం.. పరారైన ట్రాక్టర్ డ్రైవర్, స్తంభించిన ట్రాఫిక్.
జనం వాయిస్, శాయంపేట, జూలై 31:
శాయంపేట మండలం మాందారిపేట ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. హనుమకొండ నుంచి పరకాల వైపు వెళ్తున్న కొత్త సోనాలిక ట్రాక్టర్, మాందారిపేటలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే ఒక్కసారిగా బంక్లోకి మలుపు తిప్పడంతో వెనుకనే వస్తున్న మహేంద్ర సూపర్ ప్యాసింజర్ వాహనం (టీఎస్ 03 యూడీ 0468) ట్రాక్టర్ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
హనుమకొండ నుంచి భూపాలపల్లి–మహాదేవపూర్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలకు విధులకు వెళ్తున్న ఉపాధ్యాయులు ఆ మహేంద్ర సూపర్ ప్యాసింజర్ వాహనం (టీఎస్ 03 యూడీ 0468) లో ప్రయాణిస్తున్నారు. వాహనంలో మొత్తం ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం ధాటికి వాహనం ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జవగా, అందులోని ప్రయాణికులు తీవ్ర కుదుపులకు గురయ్యారు.
ప్రమాదంలో మహాదేవపూర్ ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు రాము వాహనంలోనే ఇరుక్కుపోయాడు. దాదాపు గంటపాటు తీవ్ర వేదనతో తల్లడిల్లిన ఆయనను స్థానికులు జేసీబీ సహాయంతో ఎంతో శ్రమించి బయటకు తీశారు. ప్రమాదంలో ఆయన ఎడమ కాలు విరగడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. వాహన డ్రైవర్ వేణు కూడా గాయపడినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించింది. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు తెలిపారు. భారీ ఢీకొట్టిన శబ్దానికి చుట్టుపక్కల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి సంఘటన స్థలానికి పరుగులు తీశారు. ప్రమాదం కారణంగా ప్రధాన రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. ఇరువైపులా వాహనాల క్యూలు ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
