ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి.
-పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ.
-రోడ్డు భద్రతా మాసోత్సవాలు – “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు.
జనం వాయిస్, పెద్దపల్లి:
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించి ప్రజల ప్రాణ భద్రతను కల్పించాలనే లక్ష్యంతో, తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ, రవాణా శాఖ మరియు ఆరోగ్య శాఖలు సంయుక్తంగా “అరైవ్ అలైవ్ – 2026” పేరిట రాష్ట్ర స్థాయిలో 10 రోజుల పాటు రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తాలో పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు మరియు ద్విచక్ర వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అతివేగం ప్రమాదాలకు దారి తీస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ మాట్లాడుతూ, రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణ నష్టానికి కారణమవుతుందని హెచ్చరించారు.
అలాగే, ఆర్టీఓ పెద్దపల్లి మాట్లాడుతూ, వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం, వాహనాల ఫిట్నెస్ను క్రమం తప్పకుండా పాటించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు.
ఈ అవగాహన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు మరియు ద్విచక్ర వాహనదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన పొందారు. ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.