పీటీ ఉష కుటుంబంలో విషాదం.
భర్త శ్రీనివాసన్ ఆకస్మిక మృతి.
క్రీడా రంగానికి తీరని లోటు.
ప్రధాని ఫోన్ చేసి పరామర్శ.
జనం వాయిస్, న్యూఢిల్లీ, జనవరి 30:
భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం మాజీ ఇన్స్పెక్టర్ వి. శ్రీనివాసన్ (67) శుక్రవారం తెల్లవారుజామున అకస్మికంగా మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీనివాసన్ తన నివాసంలో అనూహ్యంగా కుప్పకూలి పడిపోయారు. వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీనివాసన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పీటీ ఉషతో వివాహ బంధంలోకి ప్రవేశించారు. వీరికి ఉజ్వల్ అనే కుమారుడు ఉన్నాడు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళంలో సేవలందించి పదవీ విరమణ చేసిన అనంతరం, క్రీడా రంగంలో పీటీ ఉషకు అండగా నిలిచారు. ఆమె స్థాపించిన అథ్లెటిక్స్ శిక్షణ కేంద్ర అభివృద్ధిలో, యువ క్రీడాకారుల శిక్షణకు అవసరమైన వసతుల కల్పనలో శ్రీనివాసన్ కీలక పాత్ర పోషించారు. పీటీ ఉష అంతర్జాతీయ స్థాయిలో సాధించిన అనేక విజయాల వెనుక శ్రీనివాసన్ ఇచ్చిన నిరంతర ప్రోత్సాహం, మద్దతు ఉందని క్రీడా వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ప్రతి విజయ సందర్భంలో ఆమెకు ధైర్యం చెప్పుతూ, వెన్నుదన్నుగా నిలవడం ఆయన ప్రత్యేకతగా చెప్పుకుంటున్నారు. శ్రీనివాసన్ మృతికి క్రీడాకారులు, మాజీ క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు తీవ్ర సంతాపం తెలిపారు. శ్రీనివాసన్ ఆకస్మిక మరణం పీటీ ఉషకు, ఆమె కుటుంబానికి తీరని లోటుగా మారిందని సన్నిహితులు పేర్కొన్నారు. క్రీడా లోకంలో ఆయనను ఒక బలమైన ఆధారస్తంభంగా గుర్తు చేసుకుంటూ సానుభూతి తెలిపారు. ఈ వార్త తెలియగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీటీ ఉషకు ఫోన్ చేసి పరామర్శించారు. ఈ కష్టకాలంలో ఆమెకు, ఆమె కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ తన సానుభూతిని వ్యక్తం చేశారు.