janamvoice.com
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 7:01 am Digital Edition : JANAM VOICE

కొమురవెల్లి జాతరకు రైలు సౌకర్యం..

కొమురవెల్లి జాతరకు రైలు సౌకర్యం..

– భక్తులకు ప్రయాణ సౌలభ్యం.
– దాదాపు పూర్తైన నిర్మాణం.
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి.

జనం వాయిస్, సిద్దిపేట, జూన్ 7:

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయానికి వచ్చే భక్తుల కోసం నిర్మిస్తున్న కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ పనులు తుది దశకు చేరుకున్నాయని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ఈ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే భక్తులకు మరింత సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కలగనుందని పేర్కొన్నారు. లకుడారం, దుద్దెడ రైల్వే స్టేషన్ల మధ్య నిర్మిస్తున్న ఈ హాల్ట్ స్టేషన్‌కు 2024లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అదే ఏడాది ఫిబ్రవరి నెలలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి వేగంగా పనులు కొనసాగించగా ప్రస్తుతం నిర్మాణం దాదాపు పూర్తయింది.
మొత్తం రూ.5.63 కోట్ల వ్యయంతో ఈ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేశారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్ పూర్తయితే కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ప్రయాణం మరింత సులభం కానుంది. ప్రస్తుతం పనులు 99 శాతం పూర్తయ్యాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. మిగిలిన పనులను కూడా త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రాంతీయ రవాణా వ్యవస్థకు కూడా ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.
కొమురవెల్లి ఆలయానికి రాష్ట్రం నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడంతో భక్తుల ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా సౌకర్యవంతమైన రవాణా అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తికావడం ద్వారా కొమురవెల్లి ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు.