janamvoice.com
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 3:54 pm Digital Edition : GATTU MAHESH

యూపీఐకి షాక్ సిద్ధం..! ఇకపై లావాదేవీలకు ఛార్జీలేనా..?

యూపీఐకి షాక్ సిద్ధం..! ఇకపై లావాదేవీలకు ఛార్జీలేనా..?

జనం వాయిస్, న్యూఢిల్లీ:

దేశవ్యాప్తంగా యూపీఐ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. రోడ్డు పక్కన చిన్న దుకాణాల నుంచి పెద్ద షాపింగ్ కేంద్రాల వరకు ప్రతిచోటా నగదు లేకుండానే చెల్లింపులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు యూపీఐ ద్వారా లావాదేవీలు పూర్తిగా ఉచితంగా సాగుతున్నప్పటికీ భవిష్యత్తులో ఛార్జీలు విధించే అవకాశం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి.
యూపీఐ సేవలను నిర్వహించేందుకు భారీ ఖర్చులు అవుతున్నాయని ఫిన్ టెక్ సంస్థలు చెబుతున్నాయి. సాంకేతిక మౌలిక సదుపాయాలు, సర్వర్ల నిర్వహణ, భద్రతా వ్యవస్థలు, మోసాల నివారణ, వినియోగదారుల సేవల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయని వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు తగ్గడంతో ఈ భారాన్ని భరించడం కష్టమవుతోందని ఫోన్ పే, గూగుల్ పే వంటి సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
2023–24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నుంచి 3900 కోట్ల రూపాయల ప్రోత్సాహకం లభించగా అది ఖర్చులకు సరిపోలేదని సంస్థలు చెబుతున్నాయి. 2024–25లో ఈ ప్రోత్సాహకం 1500 కోట్లకు తగ్గగా ప్రస్తుతం బడ్జెట్‌లో కేవలం 427 కోట్లు మాత్రమే కేటాయించారని పేర్కొంటున్నాయి. యూపీఐ ప్రస్తుత విధానం దీర్ఘకాలికంగా నిలకడగా ఉండదని పేమెంట్స్ రంగానికి చెందిన సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం సబ్సిడీలు పెంచాలని లేదా వ్యాపారులపై స్వల్ప ఛార్జీలు విధించే వెసులుబాటు ఇవ్వాలని సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. చిన్న వ్యాపారులు, సామాన్య వినియోగదారులకు ఉచిత సేవలు కొనసాగించాలని, అయితే ఏడాదికి 10 కోట్లకు పైగా వ్యాపారం చేసే పెద్ద వ్యాపారుల నుంచి 0.25 నుంచి 0.30 శాతం వరకు ఛార్జీలు వసూలు చేయాలని ప్రతిపాదనలు ముందుకు వస్తున్నాయి. త్వరలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఒకవేళ ఈ ప్రతిపాదనలు అమలైతే భవిష్యత్తులో యూపీఐ వినియోగదారులపై కూడా కొంత భారం పడే పరిస్థితి ఏర్పడవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.