అజారుద్దీన్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవడం బీజేపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం.
– మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి.
జనం వాయిస్,హైదరాబాద్, అక్టోబర్ 31:
బీజేపీ ప్రవర్తన పూర్తిగా ద్వంద్వ వైఖరికి నిదర్శనమని రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే అజారుద్దీన్కు మంత్రి పదవిపై అభ్యంతరం వ్యక్తం చేయడం ద్వారా బీజేపీ తన స్వార్థ రాజకీయాలను మరోసారి బయటపెట్టిందని ఆయన అన్నారు.రాజస్థాన్లోని గంగాపూర్ జిల్లా కరణ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ కూనర్ ఆకస్మిక మరణంతో 2024 జనవరి 5న ఉపఎన్నిక జరిగిందని, ఆ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి సురేంద్రపాల్ సింగ్ 2023 డిసెంబర్ 30న అంటే ఎన్నికకు కేవలం ఆరు రోజుల ముందే బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని ఉత్తమ్కుమార్రెడ్డి గుర్తు చేశారు.“అయితే ఇంత ముఖ్యమైన విషయాన్ని బీజేపీ తెలంగాణ నాయకులు తెలియకపోవచ్చా? తెలిసీ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవడం, ఇది బీజేపీ ద్వంద్వ వైఖరికి స్పష్టమైన ఉదాహరణ కాదా?” అని ఆయన ప్రశ్నించారు.మాజీ క్రీడాకారుడు, అంతర్జాతీయ స్థాయిలో దేశానికి గౌరవం తెచ్చిన అజారుద్దీన్పై బీజేపీ చూపిస్తున్న అసహనం, రాజకీయ ద్వేషం దురదృష్టకరమని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ప్రజాప్రతినిధికి సమాన హక్కులు ఉన్నాయనీ, రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ఇలాంటి అడ్డంకులు సృష్టించడం న్యాయసమ్మతం కాదని ఆయన అన్నారు.రాష్ట్ర ప్రజలు ఈ ద్వంద్వ వైఖరిని గుర్తించి బీజేపీ నిజ స్వరూపాన్ని అర్థం చేసుకుంటారని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వ్యాఖ్యానించారు.