janamvoice.com
Newspaper Banner
Date of Publish : 25 November 2025, 4:41 pm Digital Edition : GATTU MAHESH

ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పరిశీలనా సమయంలో ప్రమాదం.
ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.
ఫ్లోరింగ్‌ కుంగిపోవడంతో అధికారులు ఆందోళన.
అప్రమత్తంగా స్పందించిన స్థానిక నాయకులు.

జనం వాయిస్, వేములవాడ :

ప్రభుత్వ విప్‌ మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌కు మంగళవారం ఉదయం తృటిలో పెను ప్రమాదం తప్పింది. వేములవాడ మున్సిపల్‌ పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పనుల పురోగతిని పరిశీలించేందుకు అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఆది శ్రీనివాస్‌ అక్కడికి వెళ్లారు. గృహ సముదాయం వద్ద బేస్‌మెంట్‌పై నిల్చొని నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఫ్లోరింగ్‌ కుంగిపోవడంతో ఉన్న అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఆకస్మిక పరిణామంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రమాద సమయంలో సమీపంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వేగంగా స్పందించి, ఆది శ్రీనివాస్‌ కింద పడిపోకుండా పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఫ్లోరింగ్‌ స్థితి, నిర్మాణ నాణ్యతపై వెంటనే నిర్వాహకులు విచారణ ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆది శ్రీనివాస్‌ ఆదేశించారు. ప్రజల కోసం నిర్మించే ఇళ్ల నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, భవన నిర్మాణ ప్రమాణాలను కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు.