అనుమానంతో భార్య హత్య: అనకాపల్లిలో దారుణం.
-ఎలమంచిలిలో కాపురం కూల్చిన అనుమానం.
-స్క్రూడ్రైవర్తో కిరాతక దాడి.
-కేసు నమోదు చేసి దర్యాప్తు.
జనం వాయిస్, అనకాపల్లి, డిసెంబర్ 24:
అనుమానం ఒక్కసారి మనసులో బీజం పడితే కాపురాలు కూలిపోతాయని మరోసారి రుజువైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి పట్టణంలో అనుమానంతో భర్త భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. బతుకుతెరువు కోసం ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన దంపతులు ఎలమంచిలిలో పాత ఇనుము దుకాణాన్ని లీజుకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. భార్య తరచూ ఫోన్లో మాట్లాడుతుండటాన్ని గమనించిన భర్త ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఫోన్లో మాట్లాడటం కొనసాగుతుండటంతో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త, స్క్రూడ్రైవర్తో ఆమెపై దాడి చేసి ప్రాణాలు తీసినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అనుమానం పేరుతో కుటుంబాల్లో పెరుగుతున్న హింసపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.