ప్రభుత్వ స్కూల్ టీచర్గా పనిచేస్తూ ప్రైవేట్ స్కూల్ ప్రమోషన్లు.
– ఇన్స్టాగ్రామ్ వీడియోలతో చిక్కుల్లో గౌతమి.
జనం వాయిస్, ఖమ్మం:
ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తూ, ఒక ప్రైవేట్ పాఠశాలకి ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్ చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది. ఖమ్మం ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి ఈ వ్యవహారంలో విద్యాశాఖ అధికారుల చర్యలకు గురయ్యారు.
గౌతమి ఓ ప్రైవేట్ స్కూల్ను ప్రోత్సహిస్తూ వీడియోలు రూపొందించి, వాటిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రచారం చేయడం నిబంధనలకు విరుద్ధమని భావించిన విద్యాశాఖ అధికారులు ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు.
సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయిన అనంతరం గౌతమి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనపై తీసుకున్న చర్యల వల్ల మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని పేర్కొంటూ, కన్నీళ్లతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె “ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వస్తోంది” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
ఈ ఘటనపై విద్యాశాఖ వర్గాలు స్పందిస్తూ, ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనపై స్పష్టమైన నియమాలు ఉన్నాయని, వాటిని ఉల్లంఘించినప్పుడు చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు, ఈ అంశంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.