యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి.
పటాన్ చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.
భానూరులో ప్రారంభమైన పి పి ఆర్ వాలీబాల్ టోర్నమెంట్.
జనం వాయిస్, పటాన్ చేరు, మే 30:
నేటి తరం యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని పటాన్ చేరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. పటాన్ చేరు మండలం భానురు గ్రామంలో ఏర్పాటు చేసిన పి పి ఆర్ వాలీబాల్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే జిఎంఆర్ లాంచనగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని తెలిపారు. నేటి ఆధునిక జీవనశైలిలో యువత ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలకే పరిమితం కాకుండా క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. క్రీడా స్ఫూర్తి యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు భావనను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా క్రీడ మైదానాలు ఏర్పాటు చేయడంతో పాటు వివిధ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తూ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. క్రీడా సదుపాయాలను సద్వినియోగం చేసుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలని కోరారు. ప్రతి విద్యార్థి తన రోజువారీ జీవితంలో కొంత సమయాన్ని క్రీడలకు కేటాయించాలని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కృష్ణ యాదవ్, శ్యాంసుందర్ రెడ్డి, క్రీడాకారులు, క్రీడా పోటీల నిర్వాహకులు పాల్గొన్నారు.