janamvoice.com
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 4:43 pm Digital Edition : JANAM VOICE

రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ షర్మిల.

రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ షర్మిల.

ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్.
కల్తీ పాల ఘటనలో 11 మరణాలపై తీవ్ర విమర్శలు.
బాధిత కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్.

జనం వాయిస్, రాజమండ్రి, మార్చి 09:

రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల ఘటనపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కృత్రిమ మేధస్సుపై చూపుతున్న శ్రద్ధలో కొంత భాగమైనా ప్రజారోగ్యంపై పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆమె కోరారు. రాష్ట్రంలో ఆహార భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజమండ్రిలో కల్తీ పాలు తాగడం వల్ల 11 మంది మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని ఆమె తెలిపారు. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సిందేనని అన్నారు. రాష్ట్రంలో పాలు, నెయ్యి, మద్యం వంటి పలు ఉత్పత్తుల్లో కల్తీ జరుగుతోందని, దీనిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వరలక్ష్మి డైరీ సంస్థ గత 11 సంవత్సరాలుగా లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఆరోపిస్తూ, ఇంతకాలం అధికారుల తనిఖీలు ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. రాజమండ్రిలో ఫుడ్ సేఫ్టీ అధికారి ఒక్కరే ఉన్నారని, ఆమె కూడా అక్కడ అందుబాటులో ఉండరని పేర్కొన్నారు. పాలల్లో యూరియా, డిటర్జెంట్లు కలుపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు కాకుండా 25 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో ఆహార భద్రతా వ్యవస్థను బలోపేతం చేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.