తెలంగాణ యూట్యూబర్ కు దక్కిన అరుదైన ఘనత..
-యూఏఈ లో పదేళ్ల పాటు ఉచితంగా ఉండేందుకు అవకాశం.
జనం వాయిస్ దినపత్రిక, గోదావరిఖని:
గోదావరిఖనికి చెందిన యూట్యూబర్ సయ్యద్ హఫీజ్కు యూఏఈ గోల్డెన్ వీసా లభించింది.తెలంగాణ వాసికి దక్కిన ఈ అరుదైన అవకాశం ఎంతో గొప్ప విషయం. ‘తెలుగు టెక్ ట్యూట్స్’ (Telugu Tech Tuts) ఛానెల్ నిర్వహిస్తున్న హఫీజ్.. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై ఇచ్చే సమాచారంతో సుమారు 1.8 మిలియన్ల సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నారు.2022లో ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 డిజిటల్ స్టార్స్లో చోటు దక్కించుకున్నారు.ఈ గోల్డెన్ వీసా ద్వారా ఆయన పదేళ్లపాటు తన కుటుంబంతో కలిసి యూఏఈలో ఉచితంగా నివసించే అవకాశం దొరికింది.తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన ఒక యువకుడు తన సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ కంటెంట్ క్రియేషన్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని పొందారు. గోదావరిఖనిలోని యైటింక్లైన్ కాలనీకి చెందిన సయ్యద్ హఫీజ్ కు ఏకంగా యూఏఈ గోల్డెన్ వీసా లభించింది. సింగరేణి కార్మికుడి కుటుంబం నుంచి వచ్చి, ఉన్నత విద్య చదవకపోయినా.. తన సొంత టాలెంట్ తో ఈ స్థాయికి ఎదగడం తెలంగాణ వాసులకు గర్వకారణంగా నిలిచింది.

తెలుగు టెక్ ట్యూట్స్..
సయ్యద్ హఫీజ్ 2011లోనే ‘తెలుగు టెక్ ట్యూట్స్’ (Telugu Tech Tuts) పేరుతో తన యూట్యూబ్ ఛానెల్ను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ సుపరిచితులైన హఫీజ్.. తన వీడియోల ద్వారా డిజిటల్ స్టార్గా ఎదిగారు. ప్రధానంగా మొబైల్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల గురించి సమగ్రంగా వివరిస్తారు. కొత్త ఫోన్ల అన్బాక్సింగ్ .. వాటి ప్రత్యేకతలు, లాభనష్టాలు, అప్డేట్స్లోని పాజిటివ్, నెగటివ్ అంశాలను ప్రజల ముందు ఆవిష్కరిస్తారు.సుమారు 1.8 మిలియన్లకు (1.79 మిలియన్లు) పైగా సబ్స్క్రైబర్లు కలిగి ఉన్న ఈ ఛానెల్ ద్వారా హఫీజ్ 4.2 వేలకు పైగా వీడియోలను అందించి మన్ననలు పొందారు. ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా ఆయన నెలకు రూ. 2 లక్షలకు పైగా ఆదాయాన్ని పొందుతున్నారు. హఫీజ్ డిజిటల్ ప్రయాణం (Digital Journey) కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు.2022లో ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన టాప్ 100 డిజిటల్ స్టార్స్ జాబితాలో సయ్యద్ హఫీజ్ 32వ స్థానంలో నిలిచారు. తెలుగు ప్రజలను ఆయన వీడియోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయని ఫోర్బ్స్ తన మ్యాగజైన్లో కొనియాడింది.సామాజిక ప్రభావాన్ని సృష్టించగలిగిన ప్రపంచవ్యాప్తంగా 10 వేల మంది క్రియేటర్లను ఎంపిక చేసే యూఏఈ గోల్డెన్ వీసాకు హఫీజ్ అర్హత సాధించడం ఎంతో గొప్ప విషయం. సాధారణంగా రెండేళ్ల వీసాకే రూ. 4 కోట్లకు పైగా ఖర్చయ్యే చోట.. హఫీజ్కు, ఆయన కుటుంబ సభ్యులకు పదేళ్లపాటు ఉచితంగా యూఏఈలో నివసించేందుకు.. అక్కడ ఉద్యోగం లేదా వ్యాపారం చేసుకునేందుకు ఈ వీసా అవకాశం కల్పిస్తుంది. అంటే దాదాపు హఫీజ్కు పరోక్షంగా రూ.40 కోట్ల వరకు ఆదా అయింది. ఈ అరుదైన అవకాశం దక్కడంపై సయ్యద్ హఫీజ్ ను సదాశివ ఫౌండేషన్ శాలువాలతో సన్మానించారు.హఫీజ్ సాధించిన ఈ అంతర్జాతీయ విజయం తెలుగు యువతకు ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తుందన్నారు.

Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments