రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు తీవ్ర విమర్శలు.
– నేర చర్యలకు ముఖ్యమంత్రి బహిరంగ పిలుపు.
– శాంతిభద్రతలను దెబ్బతీసే ప్రయత్నం
– డీజీపీ మౌనంపై ప్రశ్నలు.
జనం వాయిస్, హైదరాబాద్:
ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ జెండా దిమ్మెలను కూల్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా పిలుపునిచ్చిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి, హోంమంత్రి హోదాలో ఉన్న వ్యక్తే శాంతిభద్రతలకు భంగం కలిగించేలా మాట్లాడటం అత్యంత ప్రమాదకరమని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.
ఈ వ్యవహారంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి స్వయంగా నేర చర్యలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజలను ఆస్తుల ధ్వంసం, భౌతిక దాడుల వైపు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీస్ వ్యవస్థ ఎటు పోయిందని హరీష్ రావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇంత బహిరంగంగా నేరాలకు, విద్వేషాలకు పిలుపునిస్తుంటే రాష్ట్ర డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన నిలదీశారు. చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులు, ఆస్తుల విధ్వంసానికి పిలుపునివ్వడం రేవంత్ రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమని హరీష్ రావు విమర్శించారు. ఇలాంటి చర్యలతో తెలంగాణలో అరాచక వాతావరణాన్ని సృష్టించాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పోరాటం ప్రజల మధ్యనే జరగాలి కానీ, హింసతో కాదని ఆయన స్పష్టం చేశారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments