బాబు సూచన.. పవన్ వేగం.. కానిస్టేబుల్ ఊరికి తక్షణం బీటీ రోడ్డు మంజూరు!
-కానిస్టేబుల్ బాబూరావు నుంచి సీఎంకు వినతి.
-డిప్యూటీ సీఎం పవన్కు బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు.
-వేదికపై నుంచే అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశాలు.
-సభ ముగిసేలోపే రూ.2 కోట్లతో రోడ్డుకు పరిపాలనా అనుమతులు.
జనం వాయిస్, మంగళగిరి:
మంగళగిరిలో జరిగిన కానిస్టేబుల్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన నూతన కానిస్టేబుల్ లాకే బాబూరావు తన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వేదికపైనే విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన అక్కడికక్కడే సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. కానిస్టేబుల్ బాబూరావు స్వగ్రామమైన తెనుములబండ నుంచి ఎలుగురాతిబండ వరకు 2 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.2 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలను వెంటనే డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.క్షణాల్లో నిర్ణయం తీసుకున్న పవన్ కల్యాణ్ సభ ముగియకముందే ఆ రోడ్డు నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. ఈ ప్రతిపాదనలకు ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ నుంచి కూడా ఆమోదం లభించడం గమనార్హం. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ నిబద్ధతను ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ఒక సామాన్య కానిస్టేబుల్ వినతిని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వేదికపై నుంచే స్వీకరించి, కార్యక్రమం పూర్తయ్యేలోపే పరిష్కరించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments