ఈవీ స్కూటర్ల ప్రకటనపై బండి సంజయ్ విమర్శలు.
ప్రభుత్వ ప్రాధాన్యతలపై ప్రశ్నలు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ఆందోళన.
రాష్ట్ర పాలన గాడి తప్పిందని వ్యాఖ్యలు.
జనం వాయిస్, హైదరాబాద్, మార్చి 09:
కాలేజీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజా భవన్లో జరిగిన కార్యక్రమంలో సీఎం చేసిన ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ప్రాధాన్యతలు ఎటు వెళుతున్నాయో అర్థం కావడం లేదని బండి సంజయ్ అన్నారు. తన సామాజిక మాధ్యమ వేదిక ద్వారా స్పందించిన ఆయన, రాష్ట్రంలో కాలేజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సమస్యను ప్రస్తావించారు. వేల కోట్ల రూపాయల ఫీజులు పెండింగ్లో ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాటిని పరిష్కరించకుండా ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని ప్రకటించడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని విమర్శించారు. దళితులు, గిరిజనులకు పంపిణీ చేయడానికి భూములు లేవని ప్రభుత్వం చెబుతోందని, అయితే జర్నలిస్టులు మరియు మూసీ ప్రాజెక్టు బాధితులకు ఫ్యూచర్ సిటీలో స్థలాలు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. పెన్షన్లు ఇవ్వడానికి నిధులు లేవని చెప్పే ప్రభుత్వం, మూసీ ప్రాజెక్టు కోసం వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకువస్తుందో చెప్పాలని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు దోమల బెడద పెరిగిందని, ప్రజలు తమ పనులు చేసుకుంటున్నా కాంగ్రెస్ నేతలు దోమల్లా వచ్చి ఇబ్బందులు పెడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments