సేంద్రియ సాగు వైపు రైతులు మళ్లాలి: సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ.
– నేలకొండపల్లిలో రైతులకు అవగాహన సదస్సు.
– రసాయనాల వల్ల నేల, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం.
– భూమి పవిత్రత కాపాడాల్సిన బాధ్యత అందరిదే.
జనం వాయిస్, ఖమ్మం జిల్లా:
నేలకొండపల్లిలోని సిద్ధార్థ యోగ విద్యాలయంలో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రసాయన ఎరువులు, పురుగుల మందుల అధిక వినియోగం వల్ల నేల క్రమంగా విషతుల్యంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావం నేరుగా ప్రజల ఆరోగ్యంపై పడుతోందని పేర్కొన్నారు.
గతంలో ఉన్నట్లుగానే ప్రతి రైతు మళ్లీ సేంద్రియ సాగు వైపు మళ్లాలని నారాయణ పిలుపునిచ్చారు. దేశంలో అత్యంత సారవంతమైన భూములు ఉన్నప్పటికీ, సరైన ఉపాధి అవకాశాలు లేక యువత విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శించారు. విత్తనాలు, ఎరువుల వ్యాపారం పూర్తిగా కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లడంతో లాభాలు రైతులకు కాకుండా బడా సంస్థలకే చేరుతున్నాయని ఆరోపించారు. చివరి ఊపిరి వరకు కమ్యూనిస్టు పార్టీలోనే పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఈ సదస్సులో త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి కూడా పాల్గొని ప్రసంగించారు. భూమి పవిత్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, మనిషి అత్యాశ వల్ల ప్రకృతి సమూల నాశనానికి గురవుతోందని హెచ్చరించారు. హైబ్రిడ్ సాగు విధానాలు, పశుపోషణలో జరుగుతున్న మార్పుల వల్ల రోగాలు పెరుగుతున్నాయని, నేటి ఆహారం ఎక్కువగా కలుషితమైందని తెలిపారు.
ప్రకృతి బాగుంటేనే మనిషి జీవించగలడని, భూమికీ ప్రాణం ఉందని చిన్న జీయర్ స్వామి అన్నారు. భూమికీ విరామం ఇవ్వాల్సిన బాధ్యత సమాజంపై ఉందని, సేంద్రియ సాగు ద్వారానే ఆరోగ్యకరమైన భవిష్యత్తు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రైతులు, ప్రజలు ప్రకృతితో సమతుల్యంగా జీవించాల్సిన అవసరం ఉందని ఈ సదస్సులో వక్తలు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments