జర్నలిస్టుల భద్రతకు హామీ కావాలి.— నేరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపశమనం ఉండరాదు.
జనం వాయిస్ వెబ్:
ప్రతి సంవత్సరం నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టుల భద్రతకు అంకితమైన రోజు “ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ఇంప్యూనిటీ ఫర్ క్రైమ్స్ అగెనస్ట్ జర్నలిస్ట్ గా గుర్తించబడుతుంది. ఈ రోజు జర్నలిస్టులపై జరిగే దాడులు, బెదిరింపులు,హత్యలు వంటి నేరాలకు శిక్షలు తప్పించుకునే పరిస్థితి లేకుండా చేయాలని ప్రపంచ సమాజానికి పిలుపునిస్తుంది. వాస్తవాలను వెలుగులోకి తేవడమే వారి బాధ్యత అయినా, వారే అత్యంత ప్రమాదంలో ఉన్న వృత్తిపరులు కావడం విచారకరం.సంయుక్త రాజ్య సమితి 2013లో ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. 2011లో ఫిలిప్పీన్స్లో ఇద్దరు జర్నలిస్టులు హతమారిన సంఘటన దీనికి ప్రేరణగా నిలిచింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వేచ్ఛ, జర్నలిస్టుల భద్రతపై దృష్టి సారించడానికి ఈ రోజు వేదికగా ఉపయోగిస్తున్నారు.యునెస్కో, అంతర్జాతీయ మీడియా సంస్థలు, పలు ప్రభుత్వాలు ఈ సందర్భంగా ప్రత్యేక చర్చలు, సమావేశాలు నిర్వహిస్తాయి.భారతదేశంలో కూడా జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ స్థాయిలో పనిచేసే విలేకరులు సత్యాన్ని వెలికితీస్తే, శక్తివంతుల నుంచి ముప్పులు ఎదుర్కొంటున్నారు.నేరాలు బహిర్గతం చేయడమే కాకుండా, ప్రజలకు నిజమైన సమాచారాన్ని అందించే ఈ వృత్తి ప్రజాస్వామ్యానికి ప్రాణాధారం.కాబట్టి జర్నలిస్టులపై నేరాలు జరిగితే వాటిని కఠినంగా విచారించి న్యాయం చేయడం ప్రభుత్వాల బాధ్యత.ఇంప్యూనిటీ అంటే నేరం చేసిన వారికి శిక్ష లేకుండా ఉండే పరిస్థితి. ఈ స్థితి కొనసాగితే ప్రజాస్వామ్యం సార్థకత కోల్పోతుంది.మీడియా స్వేచ్ఛపై దాడి అంటే ప్రజల స్వరాన్నే అణచివేయడం. అందుకే యునెస్కో దేశాలను “జర్నలిస్టుల భద్రతా చట్టాలు” బలపరచాలని పిలుపునిస్తుంది. విచారణా సంస్థలు వేగంగా దర్యాప్తులు చేసి దోషులను శిక్షించకపోతే న్యాయం కేవలం మాటలకే పరిమితమవుతుంది.జర్నలిస్టులు సత్యానికి రక్షకులు. వారు బయటపెట్టే వాస్తవాల వల్లే సమాజంలో అవినీతి, అక్రమాలు వెలుగులోకి వస్తాయి. కాబట్టి వారి భద్రతకు సరైన చట్టపరమైన రక్షణ ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా స్వేచ్ఛను కాపాడే విధంగా ప్రత్యేక నిబంధనలు రూపొందించాలి. విలేకరుల హత్యలకు, దాడులకు గల కారణాలు, రాజకీయ ప్రభావాలను నిర్లక్ష్యం చేయకూడదు.ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభం అయిన మీడియాపై దాడులు జరగడం అంటే ప్రజల స్వేచ్ఛను దెబ్బతీయడమే. ఈ రోజు జర్నలిస్టుల కోసం కేవలం స్మరణా దినం మాత్రమే కాదు — న్యాయం కోసం పోరాట దినం కూడా. ప్రపంచం నలుమూలలా సత్యం కోసం రాస్తున్న ప్రతి జర్నలిస్టు భయంలేకుండా పనిచేయగల వాతావరణం కల్పించడమే ఈ దినోత్సవం ప్రధాన సందేశం.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments