నైపుణ్య మార్పిడితో ఉమ్మడి పురోగతికి అడుగులేద్దాం.
-ఐటీ, ఫార్మా, క్రీడల్లో సహకారానికి ‘తెలంగాణ’ సంసిద్ధం.
-స్టార్టప్స్ కు మార్గ నిర్దేశం..జీనోమ్ వ్యాలీని సందర్శించండి.
-క్యూబా రాయబారితో భేటీలో మంత్రి శ్రీధర్ బాబు పిలుపు.
జనం వాయిస్,మంథని:
ద్వైపాక్షిక సహకారం ద్వారా నైపుణ్యాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకొని ఉమ్మడి పురోగతి వైపు కలిసి అడుగేద్దామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ‘తెలంగాణ – క్యూబా’ మధ్య సత్సంబంధాలను పెంపొందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ మార్సన్ అగులేరా, ఫస్ట్ సెక్రటరీ మిక్కీ డియాజ్ పెరెజ్ తో ఆయన మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బయో టెక్నాలజీ, ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ, ఏఐ, ఇన్నోవేషన్, అగ్రికల్చర్, సస్టైనబుల్ ఫార్మింగ్, స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్, కల్చర్ తదితర అంశాల్లో ద్వైపాక్షిక సహాకారం(Bilateral Cooperation), నైపుణ్య మార్పిడికి(Expertise Sharing) గల అవకాశాలపై చర్చించారు.

అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేస్తున్న కృషిని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. టీ-హబ్, టీ-వర్క్స్, వీ-హబ్ ద్వారా క్యూబా స్టార్టప్స్ కు మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్స్, ఫార్మా రీసెర్చ్, పబ్లిక్ హెల్త్ డేటా తదితర అంశాల్లో సహకారం అందిస్తామన్నారు. ప్రపంచంలోని టాప్- 7 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా నిలిచిన ‘జీనోమ్ వ్యాలీ’ని సందర్శించాలని క్యూబా ప్రతినిధులను ఆహ్వానించారు. బాక్సింగ్, అథ్లెటిక్స్ లో క్యూబా నైపుణ్యాన్ని తెలంగాణకు అందించాలని కోరారు. నూతన ఆవిష్కరణలు, ఇన్నోవేషన్ డ్రివెన్ ప్రోగ్రెసివ్ విధానాలను అవలంభిస్తున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ మార్సన్ అగులేరా పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ప్రమోషన్ సెల్ డైరెక్టర్ మధుసూదన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments