మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు.
-గిరిజన సంప్రదాయాలకు అనుగుణంగా శాశ్వత అభివృద్ధి పనులు వేగవంతం.
-మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ బలరాం నాయక్ సమీక్ష.
-లక్షలాది భక్తుల రాకను దృష్టిలో పెట్టుకొని గద్దెల విస్తరణ, రహదారి మరమ్మత్తులు.
జనం వాయిస్, మేడారం:
ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర కోసం ఈసారి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆదివాసీ పూజా విధానాలు, సంప్రదాయాలు, సాంస్కృతిక విలువలకు అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. ప్రతి నిర్మాణం, ప్రతి సదుపాయం పూజారులు, గిరిజన పెద్దల సూచనలతోనే రూపుదిద్దుకుంటోంది.

ఈ రోజు వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మంత్రులు దనసరి అనసూయ (సీతక్క), కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ బలరాం నాయక్ పాల్గొన్నారు. అందరూ కలిసి అమ్మవార్లను దర్శించి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం జరుగుతున్న నిర్మాణ పనులను పర్యవేక్షించి, పురోగతిపై అధికారులను ప్రశ్నించారు. మేడారం జాతర భవిష్యత్ తరాలకు కూడా ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గద్దెల సామర్థ్యాన్ని 3 వేల నుండి 10 వేల భక్తులను ఏకకాలంలో ఆతిథ్యం ఇవ్వగల స్థాయికి పెంచుతున్నారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల ప్రాంగణాన్ని విస్తరించడంతో పాటు, దర్శన మార్గాల అభివృద్ధి, బెల్లం సమర్పణకు ప్రత్యేక లైన్లు, జంపన్న వాగులో స్నానాలకు అవసరమైన సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు.
ముందస్తు మొక్కుల కోసం వచ్చే భక్తులకు అసౌకర్యం లేకుండా ప్రధాన రహదారుల మరమ్మత్తులను అత్యవసరంగా పూర్తి చేయాలని మంత్రి పంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా అధికారులను ఆదేశించారు. జాతర ప్రతిష్ఠకు తగ్గట్టుగా భారీ స్వాగత తోరణాలు, పార్కింగ్ ప్రదేశాలు, తాగునీరు, శానిటేషన్ వంటి మౌలిక సదుపాయాలు కూడా వేగంగా సిద్ధమవుతున్నాయి. జాతర ప్రారంభానికి ముందే అన్ని పనులను పూర్తిచేస్తామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షణను పెంచినట్లు అధికారులు తెలిపారు.

Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments