చిన్న సినిమా.. పెద్ద విజయపు బాట..
– “రాజు వెడ్స్ రాంబాయి” ఓటీటీలోకి రానున్న తేది ఇదే
జనం వాయిస్,హైదరాబాద్, నవంబర్ 25:
చిన్న బడ్జెట్తో రూపొందినప్పటికీ విడుదలైన కొద్దికాలంలోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న చిత్రం “రాజు వెడ్స్ రాంబాయి” ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతున్న ఈ సినిమా ఓటీటీ విడుదలపై క్లారిటీ వచ్చిందన్న విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ చిత్రానికి ఓటీటీ డిజిటల్ హక్కులను ఈటీవీ విన్ సొంతం చేసుకున్నట్లు నిర్మాత బన్నీ వాస్ వెల్లడించారు. సాధారణంగా నాలుగు వారాల లోపే సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వస్తుంటే, ఈ సినిమా మాత్రం థియేటర్లలో 50 రోజులు పూర్తయిన తర్వాతనే ఓటీటీలోకి రానుంది. అంటే వచ్చే ఏడాది సంక్రాంతి సమయం, జనవరి 10 నుంచి 16 మధ్య ఈ చిత్రాన్ని ఈటీవీ విన్లో స్ట్రీమ్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
తెలంగాణ ప్రాంతంలో ఈ సినిమా మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. విడుదలైన మూడు రోజుల్లోనే సుమారు రూ.7.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచింది. భారీ ప్రచారం లేకపోయినా, ప్రేక్షకుల నోటిమాటే ఈ సినిమాకు పెద్ద బలంగా మారింది. గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ ప్రేమకథ సాదాసీదాగా ఉంటూనే హృదయాలను తాకిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
దర్శకుడిగా సాయిలు కాంపాటి ఈ చిత్రంతో పరిచయం అయ్యారు. హీరోగా చైతన్య జొన్నలగడ్డ తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సహనటులు శివాజీ రాజా, అనితా చౌదరి తమ పాత్రలకు న్యాయం చేశారు. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం, నేపథ్య స్వరం సినిమాకు మరింత బలం ఇచ్చాయి. నిర్మాతలు వేణు ఉడుగుల, రాహుల్ మొపిదేవి నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇంకా కొద్ది రోజుల పాటు థియేటర్లలో కొనసాగనున్న ఈ చిత్రం, తర్వాత ఓటీటీలోకి రావడంతో మరింత పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments