కేంద్రం సంచలన నిర్ణయం.. ఈ ప్రాంతాల్లో పవర్ బ్యాంక్ల వాడకం నిషేధం.
జనం వాయిస్, న్యూఢిల్లీ:
విమాన ప్రయాణికుల భద్రతను మరింత కట్టుదిట్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విమానాల్లో ప్రయాణించే సమయంలో పవర్ బ్యాంక్లను ఉపయోగించడాన్ని పూర్తిగా నిషేధిస్తూ పౌర విమానయాన నియంత్రణ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేసేందుకు పవర్ బ్యాంక్లను ఉపయోగించరాదని స్పష్టం చేసింది. అలాగే విమానాల్లో అందుబాటులో ఉన్న విద్యుత్ ప్లగ్లకు పవర్ బ్యాంక్లను అనుసంధానించడంపైనా నిషేధం విధించింది.
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విమానాల్లో లిథియం బ్యాటరీలకు సంబంధించిన అగ్ని ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పవర్ బ్యాంక్లలో ఉపయోగించే లిథియం బ్యాటరీలు అధిక ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు లేదా షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు మంటలు చెలరేగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నాణ్యత లేని లేదా పాత బ్యాటరీలు పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చని పేర్కొన్నారు. కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణికులు పవర్ బ్యాంక్లను తప్పనిసరిగా చేతి సంచుల్లో మాత్రమే తీసుకెళ్లాలి. విమానాల్లోని పైభాగంలోని నిల్వ గదుల్లో ఉంచరాదని సూచించారు. ప్రయాణ సమయంలో వాటిని ఆన్ చేసి ఉపయోగించకూడదని, ఇతర పరికరాలకు ఛార్జింగ్ కోసం వినియోగించరాదని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నిబంధనలను ప్రయాణికులందరికీ తెలియజేయాలని విమానయాన సంస్థలను కేంద్రం ఆదేశించింది.
లిథియం బ్యాటరీల వల్ల కలిగే ప్రమాదాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. భద్రతా తనిఖీల సమయంలో లిథియం బ్యాటరీలతో పనిచేసే పరికరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విమానాశ్రయ సిబ్బందికి సూచనలు ఇచ్చింది. అనుమానాస్పదంగా కనిపించే బ్యాటరీలు లేదా పరికరాలు గుర్తించిన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే పలు విదేశీ విమానయాన సంస్థలు పవర్ బ్యాంక్ల వినియోగంపై ఆంక్షలు విధించాయి. భారత్ కూడా అదే మార్గాన్ని అనుసరిస్తూ ప్రయాణికుల భద్రతకే ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నిబంధనలు అమలులోకి రావడంతో ప్రయాణికులు ముందుగానే తమ పరికరాలను పూర్తి ఛార్జ్ చేసుకుని విమాన ప్రయాణానికి సిద్ధమవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. భద్రతే ప్రధాన లక్ష్యంగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం విమాన ప్రయాణాల్లో ప్రమాదాలను తగ్గించడంలో కీలకంగా నిలవనుందని భావిస్తున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments